సికింద్రాబాద్, మార్చి 8: “మహిళలు తమ మార్గాన్ని తామే నిర్మించుకోవాలి. వారి కెరీర్కు, జీవితానికి వారే బాధ్యులు. సక్రమ మార్గంలో కఠోర సాధనతో ముందుకువెళ్తే విజయాలు దాసోహం అవుతాయి” అని హైదరాబాద్లో తొలి మహిళా స్టేషన్ హౌజ్ ఆఫీసర్ కె.మధులత అన్నారు. 174 ఏండ్ల హైదరాబాద్ పోలీసు చరిత్రలో తొలిసారిగా ఆమె మహిళా స్టేషన్ హౌస్ ఆఫీసర్గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ‘నమస్తే తెలంగాణ’ ఆమెను పలకరించింది. ఆమె మాటల్లోనే..
రాజీకి చోటే లేదు…
నేను పోలీస్ శాఖలో ప్రస్థానం మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు భారీగా మార్పులు వచ్చాయి. తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన విభిన్న విధానాలతో మహిళా పోలీసు అధికారుల సంఖ్య బాగా పెరిగింది. ఏ సమస్య వచ్చినా.. ఎలాంటి సందర్భాలు ఎదురైనా విధి నిర్వహణలో ఎక్కడా రాజీ పడలేదు. 20 ఏళ్ల కెరీర్లో అకుంఠిత దీక్షతో పనిచేయడం ఆనందంగా ఉంది. కెరీర్ ఆరంభం నుంచి ఇప్పటివరకు చాలా విభాగాల్లో పనిచేశా. ప్రతి విభాగంలో కొత్త పని నేర్చుకున్నా.
సైబర్ క్రైమ్లే సవాల్
అప్పటి నేరాలకు.. ఇప్పుడు జరుగుతున్న నేరాలకు చాలా తేడా ఉంది. అప్పట్లో అతిపెద్ద సమస్యగా నక్సలిజం ఉండేది. ప్రపంచంతో పాటు మన దేశానికి ఇప్పుడు టెర్రరిజం, సైబర్ క్రైమ్ సవాల్గా మారింది. మనిషి కంటికి కనబడకుండానే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎదుటివారి డబ్బులను కొల్లగొడుతున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా అమ్మాయిలను వేధిస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి.
మహిళా భద్రత కీలకం..
పని ప్రాంతాలు, విద్యాసంస్థలు, బస్స్టాప్లు.. ఇలా ఎక్కడైనా మహిళలు వేధింపులకు గురయ్యే అవకాశముంది. మహిళల వస్త్రధారణ వల్లే అకృత్యాలు పెరుగుతున్నాయనడం తప్పు. దాంతో నేను ఏకీభవించను.
తప్పు చేస్తే ‘మైసమ్మ’లా మారాలి..
పోచమ్మ, మైసమ్మ, దుర్గమ్మ దేవతలను ప్రజలు ఆరాధిస్తుంటారు. తప్పు చేస్తే ఆ దేవత శిక్షిస్తుందని నమ్ముతుంటారు. ఇలాగే మహిళా పోలీసు అధికారులు ఉండాలి. తప్పు చేస్తే మహిళా అధికారులు శిక్షిస్తారని మగవాళ్లతో పాటు ఆడవాళ్లు కూడా భయపడాలి. అలా మహిళా పోలీసులు విధులు నిర్వహించాలి.
మా కుటుంబమే నాకు బలం…
మా కుటుంబం సహకారంతోనే 20 ఏళ్లుగా పోలీస్ శాఖలో విధులు నిర్వర్తిస్తున్నా. సిద్దిపేట, మెదక్ జిల్లాలతో పాటు సిటీలోని పలు చోట్ల విధులు నిర్వర్తించా. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు సంతోషంగా ఉన్నది. నగర సీపీ ఆనంద్ సార్కు కృతజ్ఞతలు. నాపై ఉంచిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తా.