ఖైరతాబాద్, మార్చి 8 : తెలంగాణలో మహిళలకు గౌరవం, సముచిత స్థానం కల్పించాలని సీఎం కేసీఆర్ సంకల్పించి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ ఆచరణలోకి తీసుకువచ్చారని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఖైరతాబాద్లోని ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్ ఇండియా ఆడిటోరియంలో మంగళవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలను మంత్రి తలసాని, హోం మంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, మాగంటి గోపీనాథ్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా శోభన్ రెడ్డి, రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నాగేశ్, కార్పొరేటర్ పి. విజయా రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు మూడు రోజులుగా మహిళా దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించామని తెలిపారు. మహిళా సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా పథకాలను ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ 150 డివిజన్లలో 75 స్థానాల్లో మహిళా ప్రజాప్రతినిధులకు అవకాశం కల్పించడమే ఇందుకు నిదర్శనమని తెలిపారు. హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ.. మహిళలను గౌరవించడం తెలంగాణ సంస్కృతిలో భాగమని, హైదరాబాద్ మేయర్, డిప్యూటీ మేయర్తో పాటు వివిధ ముఖ్యమైన హోదాల్లో మహిళలకు అవకాశం కల్పించడమే నిదర్శనమని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, మాగంటి గోపీనాథ్ మాట్లాడుతూ.. మహిళా బంధు పేరుతో స్త్రీలను గౌరవించే విధంగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు.
సన్మానించి… కలిసి భోజనం చేసి..
కొవిడ్ సమయంలో ఫ్రంట్ లైన్ వారియర్స్గా పనిచేయడంతో పాటు నిత్యం ప్రజలకు అనేక సేవలందిస్తున్న ఆశ వర్కర్లు, అంగన్వాడీ, సామాజిక సేవా కార్యకర్తలను శాలువా, జ్ఞాపికలతో మంత్రులు తలసాని, మహమూద్ అలీ సత్కరించారు. అనంతరం వారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శర్మన్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటి, నగర లైబ్రరీ సంస్థ చైర్పర్సన్ కె. ప్రసన్న, సెంట్రల్ జోన్ జోనల్ కమిషనర్ రవి కిరణ్, ఖైరతాబాద్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.