మారేడ్పల్లి, మార్చి 8: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమం, అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నదని హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సికింద్రాబాద్లోని సెయింట్ మేరీస్ కళాశాల ఆడిటోరియంలో సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హోంమంత్రి మహమూద్
అలీ, నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ హాజరయ్యారు. అనంతరం హోం మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో మహిళలకు అన్ని రంగాల్లో అధిక ప్రాధాన్యతనిస్తున్నామని తెలిపారు.
నగరంలో మొట్టమొదటి సారిగా మహిళా అధికారికి ఎస్హెచ్వోగా పోలీస్ స్టేషన్ బాధ్యతలు అప్పగించామని తెలిపారు. పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. పోలీసు శాఖలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించామని, మహిళా సిబ్బంది కోసం పోలీస్ స్టేషన్లలో ప్రత్యేక బ్యారెక్లు, ఫీడింగ్ రూమ్లు, టాయిలెట్లు, విశ్రాంతి గదుల ఏర్పాటు చేసినట్లు తెలిపారు. డబుల్ బెడ్రూం ఇండ్లు, మూడెకరాల పొలం లాంటి పథకాలను మహిళల పేర్లతోనే అందించామని గుర్తు చేశారు.
నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. గతంలో పోలీసు శాఖలో 4 శాతం మంది మాత్రమే మహిళలు ఉండేవారని, ప్రస్తుతం ఆ సంఖ్య 8 శాతానికి పెరిగిందని తెలిపారు. రాష్ట్రంలో 700 పోలీసు స్టేషన్లు ఉండగా ముగ్గురు మాత్రమే మహిళలు ఎస్హెచ్వోలుగా ఉన్నారని పేర్కొన్నారు. 174 ఏండ్ల నగర పోలీసు చరిత్రలో మొట్టమొదటి సారిగా శాంతి భద్రతల పీఎస్ ఎస్హెచ్వోగా మహిళకు బాధ్యతలు ఇచ్చామని తెలిపారు. మొట్టమొదటి మహిళా ఎస్హెచ్వోగా లాలాగూడ పీఎస్ బాధ్యతలు చేపట్టిన మధులత విధులను సమర్థవంతంగా నిర్వహించి ఇతర మహిళా ఎస్సైలు, ఇన్స్పెక్టర్లకు స్ఫూర్తిగా, మార్గదర్శకంగా నిలువాలని కోరారు.
రాబోవు రోజుల్లో అన్ని పోలీసు స్టేషన్లలో మహిళలు ఎస్హెచ్వోలుగా పనిచేసే రోజు వస్తుందని ఉత్తర మండలం డీసీపీ చందనా దీప్తి అన్నారు. మహిళలపై నమ్మకం ఉంచి హోం మంత్రి, నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ లాలాగూడ పోలీసు స్టేషన్కు మహిళా అధికారిని ఎస్హెచ్వోగా నియమించడం సంతోషంగా ఉన్నదన్నారు. అనంతరం అదనపు కమిషనర్ శ్రీనివాస్, అదనపు డీసీపీ( క్రైం ) శిరీష తదితరులు ప్రసంగించారు. అనంతరం జబర్దస్త్ టీం సభ్యులు రచ్చ రవి, అదిరే అభి, పవన్, వల్లారపు శ్రీనివాస్, హరికృష్ణ, బాబు సత్యశ్రీ ఆది, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా సిబ్బంది, అధికారులకు ప్రశంసా పత్రాలను నగర సీపీ ఆనంద్ అందజేశారు.