అల్లాపూర్,నవంబర్28: ఆఖరి మజిలి గౌరవప్రదంగా ఉండాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం వైకుంఠధామాల అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా అల్లాపూర్ డివిజన్ పరిధిలోని యూసుఫ్నగర్ హిందూ శ్మశాన వాటికను అధునాతన హంగులతో రూ.2కోట్ల వ్యయంతో మోడ్రన్ వైకుంఠధామంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రవేశద్వారంలో పరమశివుని ప్రతిమను ఏర్పాటు చేస్తున్నారు. స్త్రీ, పురుషుల స్నానాల గదులు, వెయిటింగ్హాల్, దింపుడుకల్లాలు, బర్నింగ్ ప్లాట్ఫాంలతో కూడిన రెండు షెడ్లు ఏర్పాటు చేస్తున్నారు. స్వాగతతోరణాలు, నీటివసతి, ఉద్యానవనంతో పాటు సకల వసతులను ఏర్పాటు చేస్తున్నారు. బర్నింగ్ ప్లాట్ ఫాంకు చుట్టూ సిట్టింగ్ గ్యాలరీని ఏర్పాటు చేస్తున్నారు. రూ.50లక్షల వ్యయంతో శ్మశాన వాటిక ప్రహరీ, స్వాగత తోరణం, ప్రవేశ ద్వారంలో గేటు పనులు పూర్తి చేశారు. ఇటీవల తదుపరి పనుల కోసం మరో రూ.50 లక్షల నిధులను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మంజూరు చేశారు. శ్మాశనవాటిక పనులు శరవేగంగా పూర్తి చేసి త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తామని అధికారులు తెలిపారు.
ప్రత్యేక చొరవతో పనులు..
అల్లాపూర్ డివిజన్ యూసుఫ్నగర్ హిందూ శ్మశానవాటికలో ఎన్నో ఏండ్లుగా సరైన వసతులులేక అంత్యక్రియలకు వచ్చే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శ్మశానవాటికల అభివృద్ధికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అల్లాపూర్ ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని యూసుఫ్నగర్లో 2ఎకరాల విస్తీర్ణంలో మోడ్రన్ శ్మశానవాటిక ఏర్పాటుకు రూ.2కోట్ల అంచనా వ్యయంతో పనులు ప్రారంభించారు.
త్వరలోనే అందుబాటులోకి..
శ్మశాన వాటికలో ఇప్పటికే ప్రహరీ, ముఖద్వారంలో ఆర్చి గేటు పనులు పూర్తయ్యాయి. జనాభా పెరుగుదల దృష్టిలో పెట్టుకొని ఇబ్బందులు తలెత్తకుండా శ్మశానవాటికలో రెండు బర్నింగ్ పాయింట్లు, ఎలక్ట్రిక్ బర్నింగ్ పాయింట్, స్నానాల గదులు, ప్రధాన కార్యాలయం, లాకర్రూం, వెయిటింగ్హాల్ వంటి వసతులు కల్పిస్తున్నాం. అంత్యక్రియలకు వచ్చేవారి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధునాతన హంగులతో నిర్మిస్తున్నాం. శరవేగంగా శ్మశానవాటిక పనులు పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తాం.