మేడ్చల్, ఫిబ్రవరి27(నమస్తే తెలంగాణ): అవును… రాష్ట్రంలో మనషులు అంతా ఒకటే మతాలకు తావు లేదు.. అనడానికి మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పీర్జాదిగూడలో నిర్మించిన సమీకృత వైకుంఠధామమే నిదర్శనం. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనే భేదాలు లేకుండా నిర్మించిన ఈ వైకుంఠధామం మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నది. ఈ నెల 2న ఈ వైకుంఠధామాన్ని ప్రారంభించిన ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పీర్జాదిగూడ నగర పాలక సంస్థ మేయర్ జక్క వెంకట్రెడ్డితోపాటు పాలకవర్గాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ఇదే స్ఫూర్తిని ప్రజాప్రతినిధులందరూ కొనసాగించాలని మంత్రి కేటీఆర్ సూచించారు. 4 ఎకరాల విస్తీర్ణంలో రూ. 3 కోట్ల నిధులతో పీర్జాదిగూడ సమీకృత వైకుంఠధామం నిర్మించారు. ఇందులో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ సంప్రదాయాలకు అనుకూలంగా సౌకర్యాలను కల్పించారు. ప్రత్యేక స్నానపు గదులు, వందల మంది కూర్చునేలా గ్యాలరీలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా కర్మలు చేసుకునేందుకు ప్రత్యేక గదులు నిర్మించారు.
ఆహ్లాదకర వాతావారణం
పీర్జాదిగూడ సమీకృత వైకుంఠధామంలో ఆహ్లాదకరమైన వాతావారణం కనిపిస్తున్నది. ఎటు చూసినా పచ్చదనమే కనిపించేటట్లు మొక్కలు నాటారు. వైకుంఠధామం మధ్యలో శివుని విగ్రహం ఏర్పాటు చేశారు. దహన సంస్కార సమయంలో కూర్చునేందుకు మోడ్రన్ గ్యాలరీలను నిర్మించారు. కర్మలలో భాగంగా ప్రత్యేకంగా క్షౌరశాల గదిని ఏర్పాటు చేశారు. అందులో ప్రత్యేక కుర్చీలు, అద్దాలను ఏర్పాటు చేశారు. ముస్లిం, క్రిస్టియన్ సంప్రదాయాలకు అవసరమైన సౌకర్యాలను కల్పించారు. అంతేకాక అవసరమైనవారికి ఫీజర్లను వైకుంఠధామంలో అందుబాటులో ఉంచారు. రాష్ట్రంలోనే పీర్జాదిగూడ సమీకృత వైకుంఠధామం ప్రత్యేకం అని చెప్పాలి.
కుల, మతాలకు అతీతంగా..
కులమతాలకు అతీతంగా వైకుంఠధామం నిర్మించాం. రూ. 3 కోట్ల నిధులతో 4 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ సమీకృత వైకుంఠధామంలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ సంప్రదాయాలకు అవసరమయ్యేవిధంగా వసతులు కల్పించాం. అన్ని మతాలకు సమ ప్రాధాన్యం కల్పించాం. ఆహ్లాదకర వాతావరణానికి 3 వేల మొక్కలు నాటాం. వైకుంఠధామం నిర్మించిన తీరును మంత్రి కేటీఆర్ అభినందనలు చెప్పడం సంతోషన్ని కలిగించింది. ఈ వైకుంఠధామం నిర్మాణానికి మంత్రి మల్లారెడ్డి ఎంతో సహకారం అందించారు.
రాష్ర్టానికే ఆదర్శం
పీర్జాదిగూడలో నిర్మించిన సమీకృత వైకుంఠధామం రాష్ర్టానికే ఆదర్శంగా నిలుస్తున్నది. రాష్ట్రంలో కుల, మతాలకు తావులేదని నిరూపించడానికి సమీకృత వైకుంఠధామమే నిదర్శనం. మతసామరస్యానికి అద్దం పట్టే విధంగా నిర్మించిన పీర్జాదిగూడ పాలకవర్గ సంస్థ ప్రజాప్రతినిధులందరికీ అభినందనలు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ఇలాంటి వైకుంఠధామాల ఏర్పాటుకు కృషి చేస్తా.
– కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి
మా ఏడేండ్ల
పాలనలో తెలంగాణలో గంగాజమునా తెహజీబ్ సంస్కృతి ఉన్నది. మా దగ్గర మంచి సంస్కృతిని పెంపొందించాం. మంచి వాతావరణమున్నది. కులంపేరుతో, మతం పేరుతో
రాజకీయాల్లేవ్. మందిర్, మసీదు పంచాయతీల్లేవ్. అందరం మనుషులమే.. భూమ్మీద నాలుగురోజులు బతికేందుకే వచ్చాం.. పానం పోయినంక అందరం పోయేది
ఒకే చోటుకి…
– ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు