సిటీబ్యూరో, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ):హైదరాబాద్ నగరంలో రోడ్ల నాణ్యతపై రాజీ పడకుండా వాటి మన్నిక కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కాంప్రహెన్సివ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్ (సీఆర్ఎంపీ) సత్ఫలితాలనిస్తున్నది. 1839 కోట్ల రూపాయల వ్యయంతో 709 కిలోమీటర్ల మేర రోడ్లను ఐదేళ్ల పాటు నిర్వహించేలా అమలు చేస్తున్న ఈ కార్యక్రమంతో నగరంలోని చాలా వరకు ప్రధాన రహదారులు మెరుగుపడ్డాయి. ఇందులో భాగంగా.. సీఆర్ఎంపీ రహదారుల్లో ఎక్కడ చిన్న గుంత పడినా, రోడ్డు కోతకు గురైనా, ఫుట్పాత్ దెబ్బతిన్నా ఆలస్యం చేయకుండా వెంటనే మరమ్మతులు చేస్తున్నారు. అవసరమైన చోట రీకార్పెటింగ్తో మెరుగుపరుస్తున్నారు. మ్యాన్హోల్స్ ఉన్నచోట ఎగుడు దిగుడు లేకుండా ప్రయాణానికి అనుగుణంగా రోడ్డును సమం చేసి మూతలు బిగిస్తున్నారు. ఈ చర్యలతో రోడ్లు అద్దంలా మెరుస్తూ.. ప్రయాణం సాఫీగా సాగిపోతున్నది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు ఈ ప్యాకేజీలోకి మరో 102 కిలోమీటర్లను చేర్చనున్నారు. అయితే ఇందుకోసం అదనంగా ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా అదే ప్యాకేజీలో సర్దుబాటు చేయడం విశేషం. దీంతో సీఆర్ఎంపీ పరిధిలో నిర్వహించే రోడ్ల విస్తీర్ణం 811 కిలోమీటర్లకు పెరగనుంది.
రహదారుల మెరుగైన నిర్వహణకు ఉద్ధేశించిన కాంప్రహెన్సివ్ రోడ్ మెయింటనెన్స్ ప్రోగ్రామ్ (సీఆర్ఎంపీ) పథకం విజయవంతంగా కొనసాగుతున్నది. రోడ్ల నిర్వహణను ప్రైవేట్ ఎజెన్సీలకు అప్పగించి గుంతలు లేకుండా సాఫీ ప్రయాణమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నారు. నగరంలోని 9013కిలోమీటర్ల రోడ్లలో మూడు లేన్లకు మించి వెడల్పు ఉన్న 709 కిలోమీటర్ల మేర పనులను రూ. 1839 కోట్లకు 7 ప్యాకేజీలుగా విభజించి 2019లో ఐదేండ్ల పాటు జీహెచ్ఎంసీ ప్రైవేట్ నిర్వహణకు అప్పగించింది. తొలివిడతలో 329.9 కిలోమీటర్లు పూర్తి చేసుకుని, రెండో విడతలో 208 కిలోమీటర్ల పనులు తుది దశకు చేరాయి. ఈ తరుణంలోనే ప్రధాన రహదారుల ప్రైవేట్ నిర్వహణ మెరుగైన ఫలితాలను రాబట్టింది. ఎంత పని జరిగితే అంత వరకే బిల్లులు చెల్లిస్తుండడం, ముందస్తు అంచనా ప్రకారం వేసిన ప్రాజెక్టు వ్యయం కూడా మిగులు దిశగా సాగుతున్నది.
ఇందులో భాగంగానే 709 కిలోమీటర్లకు అదనంగా మరో 102 కిలోమీటర్ల మేర రోడ్లను సీఆర్ఎంపీలోకి చేర్చి ప్రజాధనాన్ని సద్వినియోగం చేశారు. మొత్తంగా సీఆర్ఎంపీ పథకంలోకి 811.96 కిలోమీటర్ల మేర చేరింది. కాగా సీఆర్ఎంపీ కింద ఇప్పటి వరకు దాదాపు రూ.980కోట్లకు పైగా ఖర్చు చేశామని, 2023 నాటికి రీకార్పెటింగ్ పూర్తి కానుందని పేర్కొన్నారు. సీఆర్ఎంసీ రోడ్ల పరిధిని వెయ్యి కిలోమీటర్లకు పెంచాలన్న లక్ష్యంతో పనులు చేపడుతున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. గతంలో రోడ్డుకు సంబంధించిన పన్నులన్నింటినీ ఒకేసారి ఐదేండ్ల పాటు టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లకు అప్పగించేవారు. కానీ సీఆర్ఎంపీతో పదే పదే టెండర్లు పిలవడం తప్పింది. జాప్యం లేకుండా, నిర్లక్ష్యానికి తావులేకుండా రోడ్ల నిర్వహణ సాధ్యమవుతున్నది. రహదారి భద్రతా ప్రమాణాలు మెరుగవుతున్నాయి.
సీఆర్ఎంపీ పనుల పురోగతిని పరిశీలిస్తే..
సీఆర్ఎంపీ వివరాలు