మణికొండ, డిసెంబర్ 20 : విద్యతోనే ఉజ్వల భవిష్యత్ అని, ప్రతిపౌరుడికి విద్యనందించడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అన్నారు. నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని ఖానాపూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో మంగళవారం రాజేంద్రనగర్, గండిపేట మండలాల ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలల ఆధ్వర్యంలో ‘బోధన అభ్యాసన సామగ్రి’ మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ మేళాను ప్రారంభించారు. చిన్న పిల్లలకు గణితం, సైన్స్ లాంటి సబ్జెక్టులను ఏ విధంగా అర్థవంతంగా చెప్పేలా వివిధ రకాల పరికరాల రూపంలో విద్యార్థులకు చాలా సులభతరంగా అర్థమైయ్యేలా ప్రదర్శనలో చూపారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేస్తోందన్నారు. తరగతి గదిలో ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను సులభతరంగా అర్థం చేసుకునేందుకు వీలుగా పరికరాలను శ్రమించి తయారుచేసి విద్యాబుద్ధులు నేర్పించడం గొప్ప విషయమన్నారు.
మూడు పాఠశాలల ఎంపిక…
ఖానాపూర్ ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణలో రెండు మండలాల ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులు రూపొందించిన ‘బోధన అభ్యాసన సామగ్రి’ మేళాలో మూడు ఉత్తమ పాఠశాలలను మండల విద్యాధికారి, నోడల్ అధికారి సమక్షంలో ఎంపిక చేశారు. గణితంలో విద్యార్థులకు సులభతరంగా అర్థమయ్యే రీతిలో ప్రదర్శనలు చేపట్టడంలో ఖానాపూర్ ప్రాథమికోన్నత పాఠశాల ప్రథమస్థానం, మణికొండ పాఠశాల ద్వితీయస్థానం, కోకాపేట పాఠశాల తృతీయస్థానంలో నిలిచినట్లు అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి రాంరెడ్డి, నోడల్ అధికారి విజయ్కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ దారుగుపల్లి రేఖయాదగిరి, వైస్ చైర్మన్ వెంకటేశ్యాదవ్, కౌన్సిలర్లు గున్నాల అమరేందర్రెడ్డి, విజితప్రశాంత్యాదవ్,మాజీ ఎంపీపీ తలారి మల్లేశ్, మున్సిపాలిటీ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు నర్సింహ, సహకార సంఘం డైరెక్టర్లు తోలుకట్టె కృష్ణ, భిక్షపతి, మాజీ సర్పంచ్ మన్నె గండయ్య, మాజీ ఉప సర్పంచ్ వెంకటేశ్యాదవ్ పాల్గొన్నారు.