బన్సీలాల్పేట్, డిసెంబర్ 20 : చదువు పూర్తయ్యాక స్కిల్స్ లేకపోతే ఈ రోజుల్లో ఉద్యోగం దొరకడం ఎంతో కష్టంగా మారింది. బస్తీలలో నివసించే పేద, మధ్య తరగతికి చెందిన యువతీ యువకులకు నైపుణ్య శిక్షణ అందించి, వారిలో ఆత్మ విశ్వాసాన్ని పెంచేందుకు టెక్ మహీంద్రా ఫౌండేషన్, అప్సా స్వచ్ఛంద సంస్థలు సంయుక్త స్మార్ట్ కేంద్రాలను ఏర్పాటు చేశాయి. ఇందులో భాగంగా గాంధీ దవాఖాన ఎదురుగా భోలక్పూర్లోని ఎవర్గ్రీన్ ఫ్రెండ్స్ అసోసియేషన్ కమ్యూనిటీ హాలులో ఉచిత శిక్షణ కేంద్రం కొనసాగుతున్నది. అందులో మూడు నెలలపాటు శిక్షణ పూర్తి చేసుకున్న అనేక మంది విద్యార్థులు కొత్తగా ఉద్యోగాలను పొందారు. ఈ సందర్భంగా శిక్షణ కేంద్రం మేనేజర్ షేక్ మౌలా మాట్లాడుతూ పదో తరగతి పాసై, ఇంటర్, డిగ్రీలో పాస్ లేదా ఫెయిల్ అయిన 19 నుంచి 27 ఏండ్ల వయస్సు ఉన్న యువతీయువకులకు వంద రోజుల పాటు అడ్వాన్స్డు అకౌంటింగ్, కంప్యూటర్ బేసిక్స్, స్పోకెన్ ఇంగ్లిష్, టైపింగ్, ఇంటర్నెట్, రిటైల్ రంగాలలో నిపుణులైన అధ్యాపకులతో నాణ్యమైన శిక్షణ అందించి, వంద శాతం ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నామని తెలిపారు. ఈ శిక్షణ కోసం ఆసక్తి ఉన్న అభ్యర్థులు వివరాల కోసం సెల్ నంబర్ 9154 990133, 91549 9013 4లలో సంప్రదించాలని ఆయన కోరారు. గాంధీ దవాఖాన ఎదురుగా యాక్సిస్ బ్యాంక్ సమీపంలో ఎవర్గ్రీన్ కమ్యూనిటీ హాలులో తమ శిక్షణ కేంద్రానికి నేరుగా వచ్చి కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
ఆత్మవిశ్వాసం పెరిగింది
నేను, మా చెల్లెలు డిగ్రీ వరకు చదివాం. ఉద్యోగం ఎలా సంపాదించాలా అని ప్రయత్నిస్తున్న సమయంలో అప్సా, టెక్ మహీంద్రా స్మార్ట్ కేంద్రంలో చేరాం. మూడు నెలల కోర్సుతో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఆంగ్ల భాష పై పట్టుసాధించాను. నాకు కాగ్నిజెంట్ సంస్థలో కంటెంట్ రైటర్ జాబ్ ఇప్పించారు. నెలకు రూ.20 వేల జీతం వస్తున్నది. చెల్లికి ఓ బీపీవోలో జాబ్ ఇప్పించారు. కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉంటున్నాం.
–ఐశ్వర్య ,బన్సీలాల్పేట్