ఖైరతాబాద్, డిసెంబర్ 9: అవినీతి ప్రక్షాళనలో తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని మాజీ ఆర్టీఐ చీఫ్ కమిషనర్ డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు అన్నారు. ప్రపంచ అవినీతి వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం యూత్ ఫర్ యాంటీ కరప్షన్ ఆధ్వర్యంలో నెక్లెస్రోడ్లోని పీపుల్స్ప్లాజా వేదికగా అవగాహన వాక్ నిర్వహించారు. ఈ వాక్ను ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు, మాజీ చీఫ్ సెక్రటరీ, రెడ్క్రాస్ సొసైటీ చైర్మన్ అజయ్ మిశ్రాతో కలిసి ప్రారంభించారు. అనంతరం డాక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఒకప్పుడు రెవెన్యూ, మున్సిపాలిటీల్లో అవినీతి అధికంగా జరిగేదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం అవినీతి ప్రక్షాళనకు విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నదన్నారు. ధరణి పోర్టల్ ఒక గొప్ప మార్పు అని, తద్వారా నూతన అధ్యాయానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారని చెప్పారు. ఈ పోర్టల్ ద్వారా ఒకరి ఆస్తికి ఇంకొకరికి పోకుండా పదిలంగా ఆన్లైన్లో చూసుకునే వీలు కల్పించారన్నారు. లంచం ఇవ్వడం ,తీసుకోవడం రెండు నేరమేనని, యూత్ ఫర్ యాంటీ కరప్షన్ అవినీతికి వ్యతిరేకంగా కొన్ని సంవత్సరాలుగా అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నదని గుర్తు చేశారు. అదే తరుణంలో నీతివంతులైన అధికారులను సమాజానికి పరిచయం చేస్తూ వారి ఆదర్శాలతో అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో యూత్ ఫర్ యాంటీ కరప్షన్ వ్యవస్థాపకుడు రాజేంద్ర పల్నాటి, మీడియా ఇన్చార్జి జయరాం, కానుగంటి రాజు, కొన్నె దేవేందర్, కోమటి రమేశ్బాబు, వరికుప్పల గంగాధర్ కాకతీయ పాఠశాల ప్రిన్సిపాల్ హరిలక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.