సిటీబ్యూరో, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ)/ బన్సీలాల్పేట్: ‘హైదరాబాద్ నగర చరిత్ర, సంస్కృతి, వారసత్వ సంపద చాలా గొప్పది. వాటిని ప్రతిబింబించే మెట్లబావి లాంటి కట్టడాలను కాపాడుకుంటేనే రాబోయే తరాలకు మెరుగైన భవిష్యత్తును అందించిన వాళ్లమవుతాం. ఇలాంటి మెట్లబావులు ఎక్కడున్నా సరే వెతికి బాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏడాది పాటు అహర్నిశలూ శ్రమించి బావి నుంచి 3900 మెట్రిక్ టన్నుల చెత్తను తొలగించి మట్టిలో నుంచి మాణిక్యాన్ని అందించిన పారిశుధ్య కార్మికులకు, సిబ్బందికి, స్థానికులందరికీ ధన్యవాదాలు. చరిత్రకు సాక్ష్యంగా నిలిచే ఈ బావి వద్ద ఓ మ్యూజియాన్ని, కెఫెటేరియా వంటి వసతులతో మంచి పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దాం. ఇంత అందంగా మారిన ఈ వారసత్వ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత బన్సీలాల్పేట స్థానికులపైనే ఉంది’. అని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. సోమవారం బన్సీలాల్పేట మెట్ల బావిని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో కలిసి ప్రారంభించారు. అంతకు ముందు ఆయన బావిని రమణీయంగా తీర్చిదిద్దిన వైనాన్ని పరిశీలించారు. ల్యాండ్స్కేప్ గార్డెన్ , ఓపెన్ ఆంఫీ థియేటర్, మ్యూజియం, బావి చరిత్రను వివరించే ఫొటో ప్రదర్శనను తిలకించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సాయన్న, ముఠాగోపాల్, కాలేరు వెంకటేశ్, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్కుమార్, ఎమ్మెల్సీలు సురభీ వాణిదేవి, ఎంఎస్ ప్రభాకర్, డిప్యూటీ మేయర్ శ్రీలతాశోభన్రెడ్డి, రెయిన్ వాటర్ ప్రాజెక్టు ఫౌండర్ కల్పన రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రపంచ వారసత్వ సంపద కలిగిన నగరంగా హైదరాబాద్కు యునెస్కో నుంచి గుర్తింపు తీసుకువచ్చే విధంగా కృషి చేస్తున్నట్లు పురపాలక శాఖ, ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు తెలిపారు. నగరంలోని బన్సీలాల్పేటలో రూ. 10కోట్ల వ్యయంతో భావి తరాలకు తెలియజేసేలా అందంగా తీర్చిదిద్దిన చారిత్రక పురాతన బావిని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మీతో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అంతకు ముందు బావి పరిసర ప్రాంతాలను మంత్రి కేటీఆర్ కలియతిరిగారు. బన్సీలాల్పేట్ ప్రధాన ద్వారం, బాహ్య కట్టడాల పరిరక్షణ చర్యలు, చక్కటి పచ్చదనంతో నిండి ల్యాండ్స్కేప్ గార్డెన్ , ఓపెన్ యాంపీ థియేటర్, బావిలో నుంచి వెలికితీసిన పురాతన పరికరాల ప్రదర్శన, ప్రత్యేక ఫొటో గ్యాలరీలను మంత్రి కేటీఆర్ సందర్శించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ కులీకుతుబ్షాహీ టూంబ్స్ వద్ద సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఆరు మెట్ల బావులను ఇదే పద్ధతుల్లో ఆగాఖాన్ ఫౌండేషన్తో కలిసి ఆధునీకరించామని చెప్పారు. వాటికి యునెస్కో నుంచి అవార్డు లభించదన్నారు. అదే విధంగా మొజాంజాహీ మార్కెట్, మిరాలంమండి, స్టేట్ సెంట్రల్ లైబ్రరీ, షేక్పేట సరాయి కలిపి మొత్తం 44 మెట్ల బావులను ఆధునీకరించి పూర్వవైభవం తీసుకువస్తామని చెప్పారు.
ఇంటర్నేషనల్ టూరిజం స్పాట్గా..
నిజాం పాలనలో ప్రజల దాహార్తిని తీర్చిన ఘనత బన్సీలాల్పేట్ మెట్లబావిదని, అంతటి సేవలందించిన మెట్ల బావి ఇక ఇంటర్నేషనల్ టూరిజం స్పాట్గా నిలువనుందని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. ఈ బావిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత స్థానికులదేనని అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్పర్సన్, కూచిపూడి డ్యాన్సర్ దీపికారెడ్డి నృత్య ప్రదర్శన ప్రధాన ఆకర్షణగా నిలిచింది. బావిని అందంగా ముస్తాబు చేయడానికి 13 నెలల పాటు అహర్నిశలు కృషి చేసిన రెయిన్ వాటర్ ప్రాజెక్టు ఫౌండర్ కల్పనా రమేశ్, గండిపేట వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధి రాజశ్రీ, జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులు, సిబ్బంది, పలు ప్రభుత్వ శాఖల అధికారులకు మంత్రి కేటీఆర్ మెమోంటోలతో ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు వాణీదేవి, ఎంఎస్ ప్రభాకర్, ఎమ్మెల్యేలు సాయన్న, ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా శోభన్ రెడ్డి, బెవరేజెస్ చైర్మన్ గజ్జెల నాగేశ్, పురపాలక శాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అర్వింద్కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్చార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్, గ్రేటర్ టీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు కట్టెల శ్రీనివాస్ యాదవ్, సికింద్రాబాద్, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేటర్ సామల హేమ తదితరులు పాల్గొన్నారు.
భావితరాలకు చరిత్ర
పురాతన మెట్ల బావి పునరుద్ధరణ ద్వారా చారిత్రక కట్టడాల చరిత్ర భావితరాలకు తెలిసే అవకాశం ఉంది, భారత ఉపఖండంలోని శుష ప్రాంతాల్లో వేసవి సీజన్లలో నీటిని నిల్వ చేయడానికి మన మెట్ల బావులు నిలిచాయి. హైదరాబాద్లోని 1915 సర్వే మ్యాప్లు ‘బావోలిస్’ ప్రకారం 6వేల మెట్ల బావులు ఉండొచ్చు. బన్సీలాల్పేట మెట్ల బావిని స్థానికులు నాగన్నకుంటగా పిలుచుకోవడం విశేషం.
– మేయర్ విజయలక్ష్మి
అందరి భాగస్వామ్యంతోనే…
బన్సీలాల్పేట్ బావి నుంచి మా సిబ్బందితో కలిసి 4 వేల మెట్రిక్ టన్నుల వ్యర్థాలను తొలగించాం. చుట్టూ సీసీ రోడ్లు, శానిటేషన్, వీధి దీపాలు, పాత అంగన్వాడీ మరోచోటకు తరలించి, నూతన టూరిజం భవన నిర్మాణం లాంటివి జీహెచ్ఎంసీ చేపట్టింది. పురాతన పైపులను తొలగించి, కొత్త సివరేజీ, తాగునీటి పైప్లైన్లను జలమండలి శాఖ చేపట్టింది. జీహెచ్ఎంసీ, విద్యుత్ శాఖ, హెచ్ఎండీఏ, సాహే, రెయిన్ వాటర్ ప్రాజెక్ట్ లాంటి పలు ఎన్జీవోల సమన్వయంతోనే మెట్లబావి పునరుద్ధరణ, సుందరీకరణ పనులు పనులు పూర్తి అయ్యాయి.
– బి.శ్రీనివాస్ రెడ్డి, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్
ప్రజల సహకారంతోనే..
భూగర్భ నీటి వనరుల వృద్ధి కోసం జీహెచ్ఎంసీ సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ బి.శ్రీనివాస్రెడ్డిని కలువగా, బన్సీలాల్పేట్ మెట్ల బావి గురించి చెప్పారు. 2021 ఆగస్ట్ 15న పునరుద్ధరణ పనులు మొదలుపెట్టాం. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ మాకు మద్దతు ఇచ్చారు. స్థానిక ప్రజలు సహకారం అందించడం వల్లనే ఈ ప్రాజెక్ట్ విజయవంతంగా పూర్తి చేయగలిగాం.
– కల్పనా రమేశ్,రెయిన్ వాటర్ ప్రాజెక్ట్ వ్యవస్థాపకురాలు (5 బిఎల్పి 2 )
బన్సీలాల్పేట్వాసుల అదృష్టం
సికింద్రాబాద్ చరిత్రలో భాగమైన ఈ నాగన్నకుంట మెట్లబావికి పూర్వ వైభవం రావడం నిజంగా ఒక అద్భుతం. ఇది సాకారం కావడడానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. అనేక సార్లు ఆయన అధికారులతో కలిసి సందర్శించి, సూచనలు అందజేశారు. దుర్గంధంతో నిండిన చారిత్రక బావి, ఒక ఏడాదిలో అద్భుతమైన పర్యాటక కేంద్రంగా మారడం మా బన్సీలాల్పేట్వాసుల అదృష్టం.
– బి.జ్ఞాని, బన్సీలాల్పేట్ నివాసి