కాప్రా, డిసెంబర్ 5 : కాప్రా సర్కిల్లో ఈ ఆర్థిక సంవత్సరానికి (2022-2023) సంబంధించి ఆస్తిపన్ను వసూళ్లు లక్ష్యానికి దగ్గరగా వేగంగా కొనసాగుతున్నాయి. సర్కిల్ పరిధిలోని కాప్రా, ఏఎస్రావునగర్, చర్లపల్లి, మీర్పేట్ హెచ్బీకాలనీ, మల్లాపూర్, నాచారం డివిజన్ల పరిధిలో 2022 ఏప్రిల్ నుంచి 2022 నవంబర్ 30 వరకు 51,075 ఆస్తుల నుంచి మొత్తం రూ.40.09 కోట్ల ఆస్తిపన్ను వసూలు జరిగిందని సర్కిల్ రెవెన్యూ విభాగం అధికారులు వెల్లడించారు. 2022 ఏప్రిల్ మాసంలో చేపట్టిన ఎర్లీబర్డ్ (ముందస్తు ఆస్తిపన్ను) వసూళ్లు రూ.24.14 కోట్లు, ఓటీఎస్ ద్వారా జరిగిన వసూళ్లు రూ.4.01 కోట్లు ఇందులో చేరి ఉన్నాయి. ఆస్తిపన్ను వసూలు బిల్కలెక్టర్లు, ఆన్లైన్ పేమెంట్ల ద్వారానే ఎక్కువ మొత్తంలో జరిగినట్లు వసూలు గణాంకాలను బట్టి స్పష్టమవుతుంది.
కాప్రా సర్కిల్ కార్యాలయంలోని పౌరసేవా విభాగం (సీఎస్సీ) ద్వారా 6986 ఆస్తుల నుంచి రూ.418.89 లక్షలు, బిల్కలెక్టర్ల ద్వారా 7,686 ఆస్తుల నుంచి 1879.93 లక్షలు, మీ-సేవ కౌంటర్ల ద్వారా 5,140 ఆస్తుల నుంచి రూ.199.41 లక్షలు, ఆన్లైన్ పేమెంట్ల ద్వారా 31,263ఆస్తుల నుంచి రూ.1511.69 లక్షలు, మొత్తం 51,075 ఆస్తుల నుంచి రూ.4009లక్షలు (రూ.40.09 కోట్లు) వసూలు జరిగినట్లు సర్కిల్ రెవె న్యూ విభాగం అందజేసిన వివరాలను బట్టి స్పష్టమవుతున్నది. 2022-2023 సంవత్సరానికి సంబంధించి ఆస్తిపన్ను వసూలు లక్ష్యం రూ.52 కోట్లుగా జీహెచ్ఎంసీ ఉన్నతా ధికారులు నిర్ణయించగా, ఈ ఏడాది ఇప్పటి వరకు రూ.40.09 కోట్ల ఆస్తిపన్ను వసూలు కావడం విశేషం. ఈ ఆర్థిక సంవత్సరం ముగియడానికి మూడు నెలల 25రోజులు మిగిలి ఉండగా, పన్ను వసూలు గణనీయంగా జరిగిందని సర్కిల్ అధికారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరో రూ.12 కోట్లు వసూలు జరిగితే చాలు, ఆస్తిపన్ను లక్ష్యాన్ని చేరుకుంటామన్న ధీమాతో ఉన్నారు.
రూ.52 కోట్ల లక్ష్యాన్ని సాధిస్తాం..
ఈ ఏడాది ఆస్తిపన్ను వసూలుకు సంబంధించి నిర్దేశిత లక్ష్యాన్ని (రూ.52కోట్లు) తప్పక చేరుకుంటాం. ఎర్లీబర్డ్, వన్టైమ్ సెటిల్మెంట్ స్కీం (ఓటీఎస్)లు పన్ను వ సూలు లక్ష్యాన్ని సులభతరం చేశాయి. ఇప్పటి వరకు రూ.40.09 కోట్ల ఆస్తిపన్ను వసూలు అయింది. రాబోయే మార్చి నెలాఖరు వరకు మిగతా ఆస్తిపన్ను రూ.12 కోట్లు వసూలు చేసి లక్ష్యాన్ని సాధిస్తాం. గృహస్తులు తమ ఆస్తిపన్నును ఎప్పటికప్పుడు చెల్లించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
–శంకర్, డిప్యూటీ కమిషనర్, కాప్రా సర్కిల్