వనస్థలిపురం, డిసెంబర్ 5 : ప్రకృతిలో అత్యంత విలువైనది రక్తమని, అలాంటి దాన్ని దానంచేసేది మన జీవితంలోనే గొప్ప కార్యమని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎమ్మార్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. వనస్థలిపురం ఏరియా దవాఖానలో నూతనంగా ఏర్పాటు చేసిన రక్తం నిల్వ యూనిట్ని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. హాస్పిటల్కు వచ్చే రోగులకు రక్తం అవసరమైతే ఇక్కడ అందుబాటులో ఉంచేందుకు యూనిట్ ఉపయోగపడుతుందన్నారు. పేదలకు మెరుగైన వైద్యం అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. కార్పొరేట్ దవాఖానలకు దీటుగా వైద్యం అందిస్తున్నామన్నారు. ఏరియా ఆస్పత్రిని నిత్యం అభివృద్ధి చేస్తూనే ఉన్నామన్నారు. భవిష్యత్తులో మరింత ఆధునికంగా తీర్చిదిద్దుతామన్నారు. ప్రజలు రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ వనస్థలిపురం డివిజన్ అధ్యక్షుడు చింతల రవికుమార్, సూపరింటెండెంట్ హరిప్రియ, కృష్ణ, వరదాచారి, గఫూర్ తదితరులు పాల్గొన్నారు.