ఆర్కేపురం, డిసెంబర్ 3: తెలంగాణ ప్రభుత్వ సహాయ సహకారాలతో హైదరాబాద్ మహానగరం ప్రపంచంతో పోటీపడి శరవేగంగా అభివృద్ధి చెందుతుందని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. శనివారం సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ ఎక్స్ పో ఈస్ట్ కార్యక్రమాన్ని ఆయన ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ముందుచూపుతో 360 డిగ్రీ కోణంలో నగరాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించారని చెప్పారు. అందులో భాగంగానే నగరవ్యాప్తంగా ఫ్లైఓవర్లు, అండర్పాస్లు, వంతెనలు, రోడ్లు అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఒకప్పడు ఐటీ అంటే బెంగుళూరు గుర్తుకు వచ్చేదని ఇప్పుడు మంత్రి కేటీఆర్ చొరవతో హైదరాబాద్ ఐటీ హబ్గా మారిందని అన్నారు. కరోనా కారణంగా దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగం వెనుకబడినప్పటికీ హైదరాబాద్పై ఎలాంటి ప్రభావం చూపలేదన్నారు. భవిష్యత్లో రియల్ ఎస్టేట్ రంగం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు.
ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి మాట్లాడుతూ గతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఈస్ట్ వైపు చాలా తక్కువగా ఉండేదని, ప్రభుత్వం ఎల్బీనగర్లో అభివృద్ధి చేసిన ఇన్ఫాస్ట్రక్చర్ వల్ల వేగంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఎల్బీనగర్లో ఎక్కడా లేని విధంగా ఫ్లైఓవర్లు, అండర్పాస్లు, విశాలమైన రోడ్లు ఉన్నాయని అన్నారు. గతంలో శంషాబాద్ విమానాశ్రయానికి పోవాలంటే గంట సమయం పట్టేదని, ఇప్పుడు 30 నిమిషాల్లోనే చేరుకుంటున్నారని చెప్పారు. దేశంలో ఎక్కడాలేని విధంగా ఎల్బీనగర్లో 70 నుంచి 80 పార్కులను నిర్మించామని సుధీర్రెడ్డి చెప్పారు. పేద ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఇండ్లను నిర్మించాలని బిల్డర్స్కు సూచించారు. రాబోయే కొన్ని రోజుల్లో మూసీ పరివాహక ప్రాంతాలు రూపురేఖలు మారిపోతున్నాయని అన్నారు. నాగోల్ నుంచి గండిపేట్ వరకు మూసీకి ఇరువైపులా 120 ఫీట్ల రోడ్డును నిర్మించేందుకు రూ.1370 కోట్లతో ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్గుప్త, పీర్జాదిగూడ మేయర్ వెంకట్రెడ్డి, బోడుప్పల్ మేయర్ బుచ్చిరెడ్డి, బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రభాకర్రావు, ప్రధాన కార్యదర్శి నర్సింహారావు, కో-కన్వీనర్ విద్యాసాగర్, కోశాధికారి గోపాల్, ఉపాధ్యక్షులు మారం సతీశ్, రమేశ్, శ్రీనివాస్, రాంరెడ్డి, రామకృష్ణారావు, సునీల్చంద్రారెడ్డి, జి.వి.రావు, శ్రీనివాస్రావు, విక్రమ్ పాల్గొన్నారు.