హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల భూముల పరిరక్షణలో భాగంగా భూముల వివరాలను గెజిట్లో నమోదు చేసే ప్రక్రియ చురుగ్గా సాగుతున్నదని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. సికింద్రాబాద్ పరిధిలో 1300 ఎకరాలు, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 3 వేల ఎకరాల వివరాలను గెజిట్లో ప్రచురించినట్టు పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్లోని అరణ్యభవన్లో దేవాదాయ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఆలయ సేవల విస్తరణ, ఆన్లైన్ సేవలు, కొత్తగా ధూపదీప నైవేద్య పథకం అమలు, భూముల గెజిట్ నోటిఫికేషన్ తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎంతో విలువైన దేవాలయ భూములను కాపాడేందుకు పటిష్ట చర్యలు తీసుకొంటున్నామని, ఒక్కసారి గెజిట్లో భూముల వివరాలు నమోదైతే కబ్జాలకు, అన్యాక్రాంతమయ్యేందుకు ఆస్కారం ఉండదన్నారు. ఈ నెల 10 లోపు రాష్ట్రవ్యాప్తంగా 74 ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో పూజా సేవలను విస్తరిస్తామని చెప్పారు. ఆయా ఆలయాల్లో అందుబాటులో ఉన్న పూజలు, వివిధ సేవల వివరాలు దేవాదాయ శాఖ వెబ్సైట్ endow ments.ts.nic.in నుంచి పొందవచ్చని మంత్రి వివరించారు. ఈ సమీక్షలో దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్కుమార్, అదనపు కమిషనర్ కృష్ణవేణి, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్(ఎండోమెంట్ ల్యాండ్స్) రమాదేవి పాల్గొన్నారు.