నేరేడ్మెట్, నవంబర్ 28 : తాళం వేసి ఉన్న ఇండ్లను టార్గెట్ చేస్తూ.. చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర పాత నేరస్తుడిని మేడిపల్లి పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం మల్కాజిగిరిలోని డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ రక్షిత కృష్ణమూర్తి వివరాలను వెల్లడించారు. కర్నూలు జిల్లా తాండ్రపాడు గ్రామానికి చెందిన పసుపతి శ్రీరాములు (50) మత్తుమందు, జల్సాలకు బానిసయ్యాడు. డబ్బు కోసం దొంగతనాలు మొదలుపెట్టాడు. కర్నూలు నుంచి హైదరాబాద్కు వచ్చిన నిందితుడు.. తాళం వేసి ఉన్న ఇండ్లను టార్గెట్ చేసుకొని దొంగతనాలకు పాల్పడ్డాడు. ఈనెల 17న పీర్జాదిగూడలోని ఓ ఇంట్లో దొంగతనం చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి, దర్యాప్తులో భాగంగా సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. ఆదివారం పీర్జాదిగూడ పరిధిలో అనుమానాస్పద స్థితిలో తిరుగుతున్న పసుపతి శ్రీరాములును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించగా దొంగతనాలకు పాల్పడినట్లు అంగీకరించాడు. దీంతో నిందితుడిని అరెస్టు చేసి, అతడి వద్దనుంచి 25 తులాల బంగారు నగలు, 500 గ్రాముల వెండి వస్తువులు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. నిందితుడిపై 15 చోరీ కేసులు ఉన్నాయని డీసీపీ చెప్పారు. నిందితుడిని పట్టుకున్న మల్కాజిగిరి ఏసీపీ పి.నరేశ్రెడ్డి బృందాన్ని ఈ సందర్భంగా డీసీపీ అభినందించారు. ఈ సమావేశంలో మేడిపల్లి ఇన్స్పెక్టర్ గోవర్ధన గిరి, మేడిపల్లి డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ డి. ప్రవీణ్ బాబు, సిబ్బంది పాల్గొన్నారు.