సిటీబ్యూరో, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ) : సిటీ బస్సులు, డిస్ట్రిక్ట్ బస్సులు.. అనే తేడా లేకుండా అన్నిరకాల ఆర్టీసీ బస్సుల్లో ఇక నుంచి క్యాష్లెస్ టికెట్ జారీ విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఆర్టీసీ చర్యలు ముమ్మరం చేసింది. నగదు రహిత టికెట్ల జారీ కోసం దాదాపు 15 వేల ఐ టిమ్స్ మిషన్లను కొనుగోలు చేయనున్నట్లు ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. ఇందుకోసం టెండర్ల ప్రక్రియ కొనసాగుతున్నట్లు తెలిపారు. ఐటిమ్స్ మిషన్ల సహాయంతో క్రెడిట్ కార్డు, డెబిట్కార్డు, ఫోన్ పే, గూగుల్పే, యూపీఐ వంటి పలు విధానాల ద్వారా టికెట్ జారీ చేయనున్నారు. నడుస్తున్న బస్సుల్లో నెట్వర్క్ సిగ్నల్ సమస్య ఎదురైనా.. టికెట్ జారీ కోసం ఐ టిమ్స్ మిషన్లు పనిచేసే విధంగా ఆర్టీసీ చర్యలు తీసుకుంటున్నది. ఈ విధానం అమలులోకి వచ్చినా.. అవసరమైన మేరకు నగదుతో కూడా టికెట్ జారీ ప్రక్రియ కొనసాగుతుంది. మరో నెల రోజుల్లో ఐ టిమ్స్ యంత్రాల సేవలు ఆర్టీసీలో సంపూర్ణంగా అమలు చేయనున్నారు. ఇప్పటికే హైదరాబాద్ నుంచి శంషాబాద్కు తిరుగుతున్న పుష్పక్ బస్సుల్లో ఐ టిమ్స్ ద్వారా నగదు రహిత టికెట్ జారీ చేస్తున్నారు. ఈ విధానం విజయవంతమైందని, ఇది కొనసాగింపుగానే అన్ని బస్సుల్లో ఈ విధానాన్ని ప్రవేశ పెట్టడంపై నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
సిటీలో అధిక ఐ టిమ్స్ యంత్రాలు ఉపయోగం..
బస్సు టికెట్ జారీ ప్రక్రియలో నగదు రహిత లావాదేవీలు నిర్వహించడంపై ఆర్టీసీ అధికారులు తీసుకున్న నిర్ణయంతో సిటీలో ఐ టిమ్స్ యంత్రాల వినియోగం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లు ఆర్టీసీ గ్రేటర్ జోన్, సికింద్రాబాద్ ప్రాంతీయ అధికారులు తెలిపారు. హైదరాబాద్ నగరంలో దాదాపు 3000 పైగా సిటీ బస్సులు ఉన్నాయి. ఒక్కొక్క బస్సుకు ఒక్కొక్క ఐ టిమ్స్ యంత్రాన్ని ఏర్పాటు చేసినా.. కనీసం ఆ మూడు వేల ఐటిమ్స్ యంత్రాలు సిటీలో అవసరం ఉంటాయన్నారు. 12 వేల డిస్ట్రిక్ బస్సులకు ఐటిమ్స్ యంత్రాలను కేటాయించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మిషన్ల నిర్వహణను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే, నగర శివారు గ్రామాలకు తిరిగే పల్లె వెలుగు బస్సుల్లో కూడా ఐ టిమ్స్ను ప్రవేశపడుతామని అధికారులు చెప్పారు. అక్కడ క్యాష్లెస్తో పాటు క్యాష్ విధానం కూడా అమలులో ఉంటుందని అధికారులు తెలిపారు.