సిటీబ్యూరో, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): బస్తీలలో నివసించే నిరుపేద విద్యార్థుల్లో గొప్ప మార్పు తేవడమే లక్ష్యంగా టచ్ ఏ లైఫ్ ఫౌండేషన్ పనిచేస్తున్నది. వారికి జీవితంలో ఎదగాలనే ఆకాంక్షను బలంగా నింపుతున్నది. ఈ క్రమంలో ఎడ్యుకేషన్ క్యాంపులు నిర్వహించి మధ్యలో చదువు ఆగిపోయిన వారి వివరాలు తెలుసుకుని ఆర్థిక వనరులు సమకూరుస్తున్నారు. సర్కారు పాఠశాలల విద్యార్థులలో బాగా చదివే వారిని ఎంపిక చేసుకుని స్కాలర్షిప్లు ఇవ్వడమే కాకుండా ‘ఐటీ యాత్రలు’ పరిచయం చేస్తున్నారు. నిరుపేద విద్యార్థుల జీవిత గాథలను సామరస్యంగా విని వారి సమస్యలకు పరిష్కారాన్ని చూపెడుతున్నారు. నిరుపేద మహిళలకు ఉపాధి చూపిస్తున్నారు. అనేక సంస్థలతో సమన్వయం చేసుకుని వివిధ రంగాలలో వారికి పని కల్పిస్తున్నారు. అంతేకాదు నిరుపేద యువతుల వివాహాలకు సహాయం అందిస్తున్నారు. వారాంతంలో బస్తీల్లో పర్యటించి బాలికలకు పోషకాహార కిట్స్ పంపిణీ చేస్తున్నారు.
టీ హబ్లో..
టచ్ ఏ లైఫ్ ఫౌండేషన్ విద్యార్థులకు సాంకేతిక ప్రపంచాన్ని పరిచయం చేయడానికి బృహత్తర కార్యక్రమం చేపట్టింది. దశల వారీగా విద్యార్థులకు ఐటీ కార్యాలయాలను పరిచయం చేయడానికి ప్రణాళికలు చేశారు. అందులో భాగంగానే కొంతమంది విద్యార్థులను స్టార్టప్ల కేంద్రం ‘టీ హబ్’కు తీసుకెళ్లారు. అక్కడ ఉన్న స్టార్టప్లను పరిశీలించడం.. ఫౌండర్స్తో మాట్లాడటం.. వారి ఆలోచనలను పంచుకోవడం చేశారు. స్టార్టప్ ప్రారంభించడానికి కావాల్సిన విజ్ఞానం తెలుసుకున్నారు. అంతేకాదు టీ హబ్ సీఈవో శ్రీనివాస్ రావుతో పాటు ఇతర ప్రముఖులతో స్ఫూర్తిగొలిపే ప్రసంగాలను అందించారు. గొప్ప లక్ష్యంతో కూడిన ఒక్క ఆలోచన ఉంటే చాలు.. గొప్పస్థాయికి తీసుకెళ్లేందుకు టీ హబ్ సిద్ధంగా ఉందని వక్తలు తెలిపారు. టీ హబ్పై అభిమానాన్ని చాటుతూ విద్యార్థులు పలు పెయింటింగ్లు వేశారు.
విద్యార్థులు గొప్పగా స్థిరపడాలి
నిరుపేద విద్యార్థులు గొప్పగా చదువుకుని జీవితంలో స్థిరపడాలనేదే మా సంకల్పం. ఏ కారణాలతోనూ వారి లక్ష్యాల నుంచి దూరం కావొద్దు. అందుకోసమే టచ్ ఏ లైఫ్ ఫౌండేషన్ పని చేస్తున్నది. విద్యార్థులకు సాంకేతిక ప్రయోజనాలు తెలిసేలా యాత్రలు చేపట్టాం. టీ హబ్ను సందర్శించాం. విద్యార్థులు చాలా సంతోషించారు. స్టార్టప్ల సమాచారం తెలుసుకున్నారు. టీ హబ్ నిర్వాహకులకు
ధన్యవాదాలు.