కేపీహెచ్బీ కాలనీ, నవంబర్ 28 : లోతట్టు ప్రాంతాల్లో ముంపు సమస్యలను పరిష్కరించే దిశగా జీహెచ్ఎంసీ ప్రత్యేక కార్యచరణతో అభివృద్ధి పనులను చేపడుతున్నది. భారీ వర్షాలు కురిసినప్పుడు ఆయా ప్రాంతాలలో వర్షంనీటి ప్రవాహానికి అడ్డంకులు ఎదురవుతున్నాయి. వర్షంనీటి ప్రవాహానికి ప్రధాన అడ్డంకులను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు పనులు చేపడుతున్నారు. ఇప్పటికే ప్రధాన వర్షంనీటి కాలువలలో బాటిల్నెక్ ప్రాంతాలను గుర్తించి ఆ ప్రాంతాలలో వర్షంనీటి కాలువలను విస్తరించే పనులను చేపట్టారు. దీనిలో భాగంగానే కూకట్పల్లి డివిజన్ ప్రశాంత్నగర్ పారిశ్రామిక వాడలో శిథిలావస్థకు చేరిన బ్రిడ్జిని గుర్తించారు. ఈ బ్రిడ్జి శిథిలావస్థకు చేరడంతో నీటి ప్రవాహానికి అడ్డంకిగా మారడం, నీటితో పాటు వచ్చే చెత్తాచెదారం ఇక్కడ ఆగిపోతున్నది. తద్వారా పరిసర ప్రాంతాల్లోని కాలనీల్లోకి వర్షం నీరు చేరడంతో ముంపు సమస్యలు ఎదురవుతున్నాయి. మరోవైపు ఈ బ్రిడ్జి మార్గంలో పలు కాలనీలకు రాకపోకలు సాగించాల్సి ఉండడంతో ఈ బ్రిడ్జి పునరుద్ధరించాల్సిన అవసరం ఏర్పడింది.
రూ.1.90 కోట్ల వ్యయంతో నిర్మాణం ..
ప్రశాంత్నగర్ పారిశ్రామిక వాడలో.. వర్షంనీటి కాలువపై గత కొన్నేళ్ల క్రితం నిర్మించిన కల్వర్ట్ (బ్రిడ్జి) ఉంది. ఈ బ్రిడ్జి ద్వారా ప్రశాంత్నగర్ పారిశ్రామిక వాడనుంచి రాజీవ్గాంధీనగర్ పారిశ్రామిక వాడ, గాంధీనగర్, కుత్బుల్లాపూర్ ప్రాంతాలకు వాహనాల రాకపోకలు సాగుతుంటాయి. అలాగే పారిశ్రామిక వాడలలో పలు సంస్థలలో పనిచేసే కార్మికులంతా ఈ బ్రిడ్జి ద్వారా రాకపోకలు సాగిస్తారు. ఎన్నో ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోని ఈ బ్రిడ్జిని పునరుద్ధరణకు రూ.1.90 కోట్ల నిధులు కేటాయించారు. ఇటీవలే కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ లు బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. 18 మీటర్ల పొడవు, 10 మీటర్ల వెడల్పుతో.. 12 అడుగుల ఎత్తుతో బ్రిడ్జిని నిర్మించనున్నారు. ఈ బ్రిడ్జి నిర్మాణంతో ప్రశాంత్నగర్ పారిశ్రామిక వాడలో ముంపు సమస్యలు తీరడంతో పాటు సమీప కాలనీల్లో నివసించే ప్రజలంతా బ్రిడ్జి పైనుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాకపోకలు సాగించవచ్చు.
ఎమ్మెల్యే కృషి ఫలితంగా..
ప్రశాంత్నగర్ పారిశ్రామిక వాడలో శిథిలావస్థకు చేరిన బ్రిడ్జితో ఇబ్బందులను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని బ్రిడ్జిని అభివృద్ధి చేసేందుకు నిధులు కేటాయించారు. ఈ బ్రిడ్జి నిర్మాణంతో వర్షంనీటి కాలువలో నీటి ప్రవాహానికి అడ్డంకులు ఉండవు. లోతట్టు ప్రాంతాల్లో ముంపు సమస్య కూడా తీరుతుంది. డివిజన్లో కాలువలన్నింటినీ ఆధునీకరించే పనులను చేస్తున్నాం. ఎమ్మెల్యే కృషి ఫలితంగా సమస్యలన్నీ పరిష్కారమవుతున్నాయి.
– జూపల్లి సత్యనారాయణ, కార్పొరేటర్, కూకట్పల్లి