ఎర్రగడ్డ, నవంబర్ 23: ఎర్రగడ్డ డివిజన్లోని డాన్బాస్కో నుంచి జనప్రియ మీదుగా ఎర్రగడ్డ వరకున్న ప్రధాన రహదారి విస్తరణను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అధికారులను ఆదేశించారు. బుధవారం మోతీనగర్ నుంచి మీటర్ ఫ్యాక్టరీ మార్గం మీదుగా ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ వరకున్న ప్రధాన రహదారిని శాఖల అధికారులతో కలిసి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పరిశీలించారు. కల్పతరు రెసిడెన్సీ, బ్రిగేడ్ సిటాడెల్, జనప్రియ తదితర టౌన్షిప్లున్న ఈ మార్గాన్ని పెరిగిన రద్దీకి అనుగుణంగా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. ఈ మార్గం మధ్యలో ఉన్న కరెంటు స్తంభాలను తొలగించి భూగర్భ కేబుల్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని, గతంలో ఉన్న డ్రైనేజీ, తాగునీటి వ్యవస్థలను విస్తరించాలని ఆదేశించారు. 24 గంటలు వాహనాల రాకపోకలతో బిజీగా ఉండే ఈ మార్గంలో పోలీసులు నిఘాను పెంచాల్సిన అవసరం ఉన్నదని గోపీనాథ్ పేర్కొన్నారు.
దీంతో మీటర్ ఫ్యాక్టరీ మార్గానికి త్వరలోమే మహర్దశ పట్టనుందని స్థానికులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. ఇక ఇదే మార్గంలో డాన్బాస్కో ఎదురుగా ఉన్న రోడ్డు అత్యంత ఇరుకుగా ఉన్నదని.. బ్రిగేడ్ సిటాడెల్ వద్ద ఉన్న మలుపు కూడా ఇరుకుగా ఉన్నందున తరచూ ట్రాఫిక్ చిక్కులు తలెత్తుతున్నాయని స్థానికులు పేర్కొనగా.. ఆయా ప్రాంతాల్లో వెంటనే రోడ్డు విస్తరణకు చర్యలు చేపట్టాలని బల్దియా డిప్యూటీ కమిషనర్ రమేశ్ను ఆదేశించారు. అధికారులతో కలిసి సుమారు గంటపాటు ఈ మార్గంలో వాహనాల రాకపోకలను ఎమ్మెల్యే గోపీనాథ్ పరిశీలించటం జరిగింది. సూచించిన అంశాలన్నింటికీ వీలైనంత త్వరగా అంచనా వ్యయాన్ని తయారు చేయాలని పేర్కొన్నారు. డివిజన్ అధ్యక్షుడు సంజీవ, ప్రధాన కార్యదర్శి షరీఫ్ఖురేషీ, కల్పతరు రెసిడెన్సీ టౌన్షిప్ చైర్మన్ చేకూరు హనుమంతునాయుడు, మాణిక్రెడ్డి, పాయిప్రసాద్, రమేష్, బ్రిగేడ్ సిటాడెల్, జనప్రియ టౌన్షిప్లకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.
తాగునీటి పైప్లైన్ పనులకు శంకుస్థాపన
డివిజన్ పరిధిలోని నటరాజ్నగర్లో రూ.5.5 లక్షల అంచనా వ్యయంతో తాగునీటి పైప్లైన్ పనులకు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కార్పొరేటర్ షాహీన్బేగంతో కలిసి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నటరాజ్నగర్కు సమీపంలో ఉన్న నేతాజీనగర్, సుల్తాన్నగర్ తదితర ప్రాంతాల్లో తాగునీటితో పాటు సీవరేజ్ పైప్లైన్ పనులను త్వరలో చేపట్టనున్నట్లు వివరించారు. ఇటవలే సీఎం సహాయ నిధి ద్వారా మెరుగైన చికిత్స పొంది ప్రస్తుతం నటరాజ్నగర్లో కోలుకుంటున్న ఓ బాధితుని ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను గోపీనాథ్ పరామర్శించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు సంజీవ, ప్రధాన కార్యదర్శి షరీఫ్ఖురేషీ, మాజీ కార్పొరేటర్ మహ్మద్షరీఫ్, గంట మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.