సికింద్రాబాద్, నవంబర్ 23 : పేదల ఆరోగ్యానికి సర్కారు పెద్దపీట వేస్తుందని తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు. కంటోన్మెంట్ బోర్డు పరిధిలో నూతనంగా ఏర్పాటు చేయనున్న ఎనిమిది బస్తీ దవాఖానల నిర్మాణ పనులను జిల్లా వైద్యాధికారి వెంకటి, బోర్డు ఇంజినీర్లతో కలిసి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ప్రజారోగ్యానికి తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని, దానికి నిదర్శనం బస్తీ దవాఖానల ఏర్పాటేనని అన్నారు. బస్తీ దవాఖానల్లో అవుట్ పేషెంట్ సేవలు అందించడం సహా బీపీ, షుగర్తోపాటు 57 రకాల వైద్య పరీక్షలు చేస్తారన్నారు. బస్తీ దవాఖానలలో 150 రకాల మందులను ఉచితంగా అందిస్తామని, స్వల్పకాల అనారోగ్యానికి తక్షణ వైద్య చికిత్సలు అందించడం సహా టీకాలు వేయడం, కుటుంబ నియంత్రణ, వైద్య పరమైన కౌన్సెలింగ్ ఇస్తారని చెప్పారు. ఇక పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించడంలో బస్తీ దవాఖాన ఎంతో ఉపయోగపడుతుందన్నారు. త్వరలోనే కంటోన్మెంట్ బస్తీల్లో పేదలకు వైద్య సేవలు దరి చేరనున్నాయని చెప్పారు.