సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): రోడ్డు ప్రమాదాలను అరికట్టడం.. ప్రజల్లో ట్రాఫిక్ నిబంధనలపై సంపూర్ణ అవగాహన తీసుకువచ్చేందుకే జరిమానాలు విధించడం.. అందునా సామాన్యుడిపై అధిక భారం లేకుండా వాటిని రూపొందించామని ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా గత ప్రభుత్వాల హయాంలో నిర్ణయించిన జరిమానాలను ఇప్పుడు తగ్గించి అమలులోకి తీసుకువచ్చినట్లు చెప్పారు. ఈ మేరకు గతంలో పలు నిబంధనల ఉల్లంఘనలకు ఎంతమేర జరిమానాలు ఉండేవి.. ప్రస్తుతం అమలులో ఎంత ఉన్నాయనే వివరాలను బుధవారం ట్రాఫిక్ పోలీసులు విడుదల చేశారు. వీటిని పరిశీలిస్తే… ప్రధానంగా ద్విచక్ర, ఆటోలకు సంబంధించి ఉల్లంఘనలపై మునుపటికంటే భారీగానే తగ్గింపు చేపట్టినట్లుగా స్పష్టమవుతున్నది.ఆర్నెళ్ల వ్యవధిలో రెండోసారి ఉల్లంఘనకు పాల్పడితే మాత్రమే కాస్త ఎక్కువ జరిమానాలు ఉన్నప్పటికీ.. ఆ మొత్తం కూడా గతంలో దానికంటే తక్కువగా ఉన్నాయి.
నగరంలో ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలను వంద శాతం పాటించేలా ట్రాఫిక్ పోలీసులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. ఇందులో భాగంగా రోడ్డు ప్రమాదాల కారణాల్లో కీలకమైన రాంగ్రూట్, ట్రిపుల్ రైడింగ్పై కొన్నిరోజులుగా ప్రత్యేక దృష్టిసారించారు. ఈ మేరకు గత కొన్నిరోజులుగా వాహనదారుల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఈ నెల 28 నుంచి రాంగ్సైడ్ డ్రైవింగ్తో పాటు ట్రిపుల్ రైడింగ్పై జరిమానాల్ని కఠినతరం చేయనున్నారు. అయితే, వాహనదారుల్లో సింహభాగం నిబంధనల్ని పాటిస్తున్నప్పటికీ కొంతమంది ఉల్లంఘనులతోనే ట్రాఫిక్ ఇబ్బందులు జఠిలం కావడం, ప్రమాదాలు జరగడం వంటివి చోటుచేసుకుంటున్నాయి. ఇలాంటి వారి కోసం అమలు చేయనున్న ఈ జరిమానాలు భారీగా ఉన్నాయని, సామాన్యుడిపై ఆర్థిక భారం అంటూ గత రెండు, మూడు రోజులుగా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతుంది.
దీనిపై స్పందించిన ట్రాఫిక్ పోలీసులు బుధవారం వాటిపై స్పష్టతనిచ్చారు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి 2011, ఆగస్టు 18న ఇచ్చిన జీవో నంబర్ 108లో నిర్ణయించిన జరిమానాల కంటే ప్రస్తుతం అమలులో ఉన్నవి చాలా తక్కువగా ఉన్నాయి. ప్రధానంగా ఓవర్ స్పీడ్, రాంగ్ రూట్ జరిమానాల్ని ద్విచక్ర, ఆటో యజమానులు.. సామాన్యులే అధికంగా ఉంటారనే ఉద్దేశంతోనే భారీగా తగ్గించామని ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ తెలిపారు. ప్రజలను జరిమానాలతో ఇబ్బంది పెట్టాలనేది తమ లక్ష్యమే కాదని, ప్రమాదాల్ని నివారించాలనే సదుద్దేశంతోనే అమలు చేస్తున్న వీటిని ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. కాగా, జరిమానాల్ని భారీగా పెంచారంటూ కొందరు పనిగట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వారిపై చట్టపరంగా చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ప్రజలు ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మొద్దంటున్న ట్రాఫిక్ పోలీసులు.. ఏవైనా సందేహాలు ఉంటే 8712660652 నంబర్కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవాలని సూచించారు.