శేరిలింగంపల్లి, నవంబర్ 23: పాఠశాలల విద్యార్థులు పోలీస్ స్టేషన్లను సందర్శించాలని, మార్పులను గమనించి సేవలను పరిశీలించాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర సూచించారు. బుధవారం గచ్చిబౌలి టీసీఎస్ సినర్జీ పార్క్ సంస్థ కార్యాలయంలోని ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన “పాఠశాలల్లో రక్షణ, భద్రతా ప్రమాణాలపై చర్చ- సేఫ్టీ క్లబ్”ల ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ.. బడిపిల్లల అభిప్రాయానికి తగిన ప్రాధాన్యతను ఇవ్వాలని, వారు తమ దృష్టికి తీసుకువచ్చే అంశాల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని పాఠశాలల యాజమాన్యాలకు, పోలీసులకు సూచించారు. ప్రతి దశలో బడి పిల్లలను భాగస్వాములను చేయాలన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ద్వారా సమస్యలను తెలుసుకోవడం కంటే ముందు.. విద్యార్థులు నేరుగా ఫిర్యాదులు చేసేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఇందుకోసం పాఠశాలలు, పోలీసులు సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. సేఫ్టీ క్లబ్లు చిన్నారుల కేంద్రంగా ఉండాలని అన్నారు. మాదాపూర్ డీసీపీ కె.శిల్పావల్లి మాట్లాడుతూ.. పాఠశాలల్లో సేఫ్టీ క్లబ్లు ప్రధానంగా భౌతిక భద్రత, సైబర్ భద్రత, యాంటీ డ్రగ్ అబ్యూజ్డ్, మానసిక ఆరోగ్య పరిస్థితి.. అనే నాలుగు స్తంభాలపై కొనసాగుతాయని తెలిపారు. సేఫ్టీ క్లబ్ కన్వీనర్, బాలమిత్ర టీచర్ల అధ్వర్యంలో నెలవారీగా కార్యకలాపాలు ఉంటాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో సంఘమిత్ర పాఠశాల వ్యవస్థాపకురాలు అనూరాధ, ఎస్సీఎస్సీ ప్రతినిధి కృష్ణ యేదుల, టీసీఎస్ సంస్థ జనరల్ మేనేజర్ రాజుతో పాటు వివిధ పాఠశాలలకు చెందిన పలువురు ప్రధానోపాధ్యాయులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.