సిటీబ్యూరో, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): ఈ ఏడాదిలో దేశ వ్యాప్తంగా జరిగిన మొత్తం భూ లావాదేవీల్లో 50 శాతం హైదరాబాద్లోనే జరిగాయి. ఈ విషయాన్ని ప్రముఖ రియల్ ఎస్టేట్ మార్కెట్ అధ్యయన సంస్థ అనరాక్ గ్రూప్ తన అధ్యయనంలో వెల్లడించింది. దేశ వ్యాప్తంగా రెసిడెన్షియల్ డెవలప్మెంట్ల కోసం ల్యాండ్ పార్సిళ్లను కొనుగోలు చేసిన ప్రముఖ సంస్థల్లో గోద్రెజ్ ప్రాపర్టీస్, ఒబెరాయస్ రియల్టీ, మహీంద్రా లైఫ్ స్పేస్, గౌర్స్ గ్రూపు, మైక్రోసాప్ట్, మ్యాప్ట్రీ లాజిస్టిక్లు ఉన్నాయి. కమర్షియల్ రియల్ ఎస్టేట్లో తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంటూ ఈ ఏడాది దేశంలో నమోదైన మొత్తం భూ ఒప్పందాల్లో హైదరాబాద్ దాదాపు 50 శాతంగా ఉంది. 2022 మొదటి తొమ్మిది నెలల్లో దేశవ్యాప్తంగా 8 అగ్రశ్రేణి నగరాలు 1656 ఎకరాలకు సంబంధించి వేర్వేరు ఒప్పందాలు చేసుకున్నాయి. ఇందులో 769 ఎకరాలు హైదరాబాద్లోనే ఉన్నాయని అనరాక్ అధ్యయనంలో వెల్లడించింది. కరోనా తర్వాత హైదరాబాద్లో వేగవంతమైన పట్టణీకరణ నమోదు చేస్తోంది.
ముఖ్యంగా నగరంలోని వెస్ట్ జోన్లో ఎక్కువగా భూలావాదేవీలు జరిగాయని, కొత్త ప్రాజెక్టుల కోసం బిల్డర్లు భూసేకరణపై ఆసక్తి కనబరిచారని పేర్కొంది. హైదరాబాద్ తర్వాత బెంగళూరులో 223 ఎకరాలు, ముంబై మెట్రో పాలిటన్ రీజియన్ 199 ఎకరాలతో అధిక లావాదేవీలు కలిగి ఉన్నాయి. ఇక.. హెటిరో గ్రూపు రూ.350 కోట్ల విలువైన 600 ఎకరాల భూమిని, మైక్రోసాప్ట్ డేటా సెంటర్ కోసం మరో 41 ఎకరాలను కొనుగోలు చేసింది. మొత్తం మీద అత్యధిక విలువ కలిగిన ల్యాండ్ కొనుగోళ్లు రూ.1313 కోట్లుగా ఉన్నట్లు అనరాక్ వెల్లడించింది.