సిటీబ్యూరో, నవంబర్ 22(నమస్తే తెలంగాణ) : ‘సాధారణంగా క్రీడలంటే యుక్త వయస్కుల వారికే అనుకుంటాం. కానీ.. 62 ఏండ్ల వయస్సులో అదీ.. కాలేయ మార్పిడి చికిత్స చేయించుకున్న వ్యక్తి భారత్ తరఫున టెన్నిస్ ఆడటం అంటే ప్రత్యేకతనే. రైల్వేలో ఉద్యోగ విరమణ పొందిన పీవీ.రమణయ్య ఇప్పుడా ప్రత్యేకతను సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం అతడి వయస్సు 62 ఏండ్లు. నాలుగేళ్ల కిందట అతడికి కాలేయ మార్పిడి శస్త్ర చికిత్స జరిగింది. క్రీడలపై ఉన్న ఆసక్తితో వృద్ధాప్యంలోనూ పూర్తి ఫిట్నెస్తో టెన్నిస్లో నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. అదే ఇప్పుడు అతడికి ప్రత్యేక గుర్తింపును తెచ్చింది. ఆర్గాన్ అనే సంస్థ వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలోని పెర్త్లో నిర్వహిస్తున్న వరల్డ్ ట్రాన్స్ ప్లాంట్ గేమ్లో ఆడేందుకు రమణయ్యను ఎంపిక చేసింది. దీంతో టెన్నిస్ క్రీడలో రమణయ్య భారతదేశం తరపున ఆడనున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..’ విశాఖపట్నంకు చెందిన పి.వి.రమణయ్యకు చిన్నప్పటి నుంచి క్రీడలంటే ఇష్టం. ఫుట్బాల్లో రాణించిన రమణయ్య స్పోర్ట్స్ కోటాలో 1983 సంవత్సరంలో సికింద్రాబాద్లో ఇండియన్ రైల్వేలో ఉద్యోగాన్ని పొందాడు. క్రీడలపై ఉన్న మక్కువను చంపుకోక రమణయ్య ఉద్యోగం చేస్తూనే నేపాల్లో జరిగిన జూనియర్ ఆసియా యూత్ ఫుట్బాల్ చాంపియన్షిప్లో భారత్ తరఫున ఆడాడు. రెండేళ్ల కిందట ఉద్యోగ విరమణ పొందిన అతడు.. ఆ తర్వాత కూడా తన అభిరుచిని మానుకోలేక క్రీడలను ప్రదర్శిస్తూనే ఉన్నాడు.
విధి వక్రించినా..
జీవితం సాఫీగా సాగిపోతున్న తరుణంలో చిన్న కుదుపు. 2017 సంవత్సరంలో విధి వక్రించి రమణయ్య కాలేయ సమస్య బారినపడ్డాడు. హైదరాబాద్లోని గ్లోబల్ దవాఖానలో పరీక్షలు చేయించుకున్నాడు. పరీక్షించిన వైద్యులు కాలేయ మార్పిడి తప్పనిసరి అని సూచించారు. ఈ మేరకు మరణించిన దాత కాలేయ మార్పిడితో 2017 ఫిబ్రవరి 2వ తేదీన శస్త్ర చికిత్స చేసి వైద్యులు రమణయ్యకు పునర్జన్మను ప్రసాదించారు. వేగంగా కోలుకున్న రమణయ్య నెల రోజుల్లోనే దవాఖాన నుంచి డిశ్చార్జి అయ్యాడు. కాలేయ మార్పిడి తర్వాత రమణయ్య విశ్రాంతిని కోరుకోలేదు. తిరిగి తన జీవనశైలిని కొనసాగించాడు. ఫుట్బాల్తోపాటు టెన్నిస్ ఆటపైననూ రమణయ్యకు ఆసక్తి ఉండటంతో వయసు రీత్యా టెన్నిస్ ఆడటం మొదలుపెట్టాడు. స్థానికంగా నిర్వహించిన టోర్నమెంట్లోనూ పాల్గొని ప్రతిభ కనబరుస్తూ వచ్చాడు.
ప్రపంచ ట్రాన్స్ప్లాంట్ గేమ్స్కు ఎంపిక
ఉద్యోగం చేస్తున్న సందర్భంలోనూ భారత్ తరఫున ఆడిన రమణయ్యకు ఉద్యోగ విరమణ తర్వాత.. కాలేయ మార్పిడి శస్త్ర చికిత్స జరిగిన తర్వాత కూడా అనూహ్యంగా.. మరోసారి భారత్ తరఫున ఆడే అవకాశాన్ని పొందాడు. ఆర్గాన్ రిసీవింగ్ అండ్ గివింగ్ అవేర్నెస్ నెట్వర్క్(ORGAN) అనే సంస్థ అవయవ దానం యొక్క ప్రాముఖ్యత, ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పించడంలో భాగంగా ప్రతి యేటా ట్రాన్స్ ప్లాంట్ గేమ్స్ను నిర్వహిస్తున్నది. అవయవ మార్పిడి చేసుకున్నవారు మార్పిడి తర్వాత సాధించగల ఆరోగ్యం, ఫిట్నెస్ను ప్రదర్శించేందుకు అవసరమైన ప్రోత్సాహాన్ని అందించేందుకు ఈ గేమ్స్ను నిర్వహిస్తోంది. 2023 సంవత్సరంలో ఆస్ట్రేలియాలోని పెర్త్లో వరల్డ్ ట్రాన్స్ ప్లాంట్ గేమ్స్ను నిర్వహిస్తుండగా.. క్రీడాకారుల ఎంపిక కోసం 2022 ఆగస్టులో ఐదు రోజులపాటు శిబిరాన్ని నిర్వహించింది.
ఈ శిబిరంలో రమణయ్య పాల్గొని సెలెక్ట్ అయ్యాడు. భారత్ తరఫున రమణయ్య టెన్నిస్ ఆడే అవకాశాన్ని కల్పించింది. అలాగే ఆర్గాన్ సంస్థ అతడిని 24వ వరల్డ్ ట్రాన్స్ ప్లాంట్ గేమ్స్- 2023 కోసం టీమ్ ఇండియాకు టీమ్ మేనేజర్గానూ నియమించింది. ఈ సందర్భంగా రమణయ్య మాట్లాడుతూ.. ‘కాలేయ సంబంధిత సమస్య బారిన పడ్డప్పుడు నిరాశకు లోనయ్యా. గ్లోబల్ హాస్పిటల్ వైద్య బృందం నాకు పునర్జన్మను ప్రసాదించడంతోపాటు మనోధైర్యాన్ని నింపారు. కాలేయ మార్పిడి తర్వాత మళ్లీ నేను ఆటలు ఆడుతానని అనుకోలేదు. నాకు అత్యంత ఇష్టమైన క్రీడ ద్వారా మలిదశలో మరోసారి భారత్ ఖ్యాతిని చాటే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది’ అని అన్నారు.