కాలనీ రహదారులపై ఇష్టం వచ్చిన స్పీడుతో బండ్లు నడుపుతామంటే..కుదరదు.. మీ వేగానికి కళ్లెం వేసుకోవాల్సిందే. రయ్య్మ్రంటూ దూసుకెళ్తూ.. ప్రమాదాలకు కారణమవుతున్న వాహనదారులకు పగ్గాలు వేసేందుకు బల్దియా, పోలీస్, రవాణా శాఖ సంయుక్తంగా చర్యలు చేపట్టాయి. ఇందులోభాగంగానే ప్రమాదాల నివారణే లక్ష్యంగా గ్రేటర్ రోడ్లపై వేగ పరిమితిని మూడు విభాగాలుగా విభజించారు. ప్రధాన రహదారులపై దృష్టి సారిస్తూనే.. కాలనీల్లోనూ యాక్సిడెంట్లను నివారించేందుకు వాహనాల స్పీడుకు కళ్లెం వేశారు. అక్కడ ఏ వాహనమైనా 30 కి.మీ వేగం మించరాదని నిబంధన పెట్టారు. అలాగే డివైడర్లు ఉన్న రోడ్డుపై 60 కి.మీ, అవి లేని ప్రాంతాల్లో 50 కి.మీ వేగాన్ని మించి వెళ్లడానికి వీల్లేదు. మరోవైపు గ్రేటర్లోని 4,800లకు పైగా ఉన్న కాలనీల్లో ప్రతి వాటిలో వేగ నియంత్రణ సూచిక బోర్డులను ఏర్పాటు చేస్తున్నది బల్దియా. ఇప్పటివరకు 600లపైగా బోర్డులను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
యుద్ధాలలో కన్నా రోడ్డు ప్రమాదాల్లోనే చనిపోతున్న వారి సంఖ్య ఎక్కువ అంటే అతిశయోక్తి కాదు. రోడ్డు ప్రమాదాలు ఎన్నో కుటుంబాలను చిన్నాభిన్నం చేసి తీరని శోకాన్ని మిగిలిస్తున్నాయి. కారు చక్రాల కింద పడి చిన్నారి మృతి, బైక్ ఢీ కొని బాలుడి దుర్మరణం.. పలువురికి తీవ్ర గాయాలు ఇలాంటి హృదయవిదారకర వార్తలు మనం తరచూ చూస్తుంటాం. ఎందరికో గుండెకోతను మిగిల్చే ఇలాంటి ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు జీహెచ్ఎంసీ నడుంబిగించింది. ప్రయాణం కాకూడదు ప్రాణాంతకం అంటూ ప్రాణం విలువ తెలియజేస్తూ ప్రజల్లో విస్తృత అవగాహన కల్పిస్తున్నారు. కాలనీల్లో స్పీడ్ లిమిట్ను ఏర్పాటు చేసి, ఉల్లంఘనలపై కొరడాఝుళిపిస్తూ భద్రమైన ప్రయాణానికి బాటలు వేస్తూ భాగ్యనర వాసులకు జీహెచ్ఎంసీ రోడ్డు భద్రతను కల్పిస్తున్నది.
సిటీబ్యూరో, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ కాలనీల్లో రయ్ మంటూ దూసుకుపోతామంటే ఇక కుదరదు. కచ్చితంగా వేగ నియంత్రణ పాటించాల్సిందే. లేదంటే ప్రత్యేక తనిఖీలతో ఉల్లంఘనులపై పోలీస్ శాఖ చర్యలు చేపట్టనుంది. జీహెచ్ఎంసీ, పోలీస్, రవాణాశాఖ సంయుక్తంగా కలిసి గ్రేటర్ రహదారులపై వేగ పరిమితులను మూడు కేటగిరీలుగా విభజించారు. ఇందులో కాలనీ రోడ్డులో కారు, బైక్లు, ఇతర వాహనాలన్నీ వేగం గంటకు 30 కిలోమీటర్ల మేర మాత్రమే ఉండాలి. ప్రధాన రహదారులపై వేగ నియంత్రణ చర్యలు చేపడుతూనే కాలనీ రోడ్లపై జరుగుతున్న ప్రమాదాలను పూర్తి స్థాయిలో నియంత్రించే ఉద్దేశంలో భాగంగా ఈ నిర్ణయాన్ని తీసుకువచ్చి అమలు చేస్తున్నారు. గ్రేటర్లో 4,800లకు పైగా ఉన్న కాలనీల్లో ప్రతి కాలనీలో వేగ నియంత్రణ సూచిక బోర్డులను జీహెచ్ఎంసీ ఏర్పాటు చేస్తున్నది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు 600లకు పైగా సూచిక బోర్డులు ఏర్పాటు చేశామని, అన్ని కాలనీల్లో వేగ నియంత్రణ బోర్డులు పెడతామని అధికారులు స్పష్టం చేశారు.
అన్ని రోడ్లపై వేగనియంత్రణ చర్యలు..
గ్రేటర్లో రహదారుల మొత్తం పొడవు 9,013 కిలోమీటర్లు, 2,846 కిలోమీటర్లు మేర బీటీ రోడ్లు, 6,167 కిలోమీటర్లు సీసీ రోడ్లు , సింగిల్ లేన్ ( 7 మీటర్లు) 6,655 కిలోమీటర్లు ,డబుల్ లేన్ (7-10.5 మీటర్లు) 1709 కిలోమీటర్ల మేర ఉన్నాయి. త్రీ లేన్ (10.5 నుంచి 14 మీటర్లు) 123 కిలోమీటర్లు , ఫోర్ లేన్/ అపై ( 14 మీటర్ల పైబడి ఉన్నవి) 526 కిలోమీటర్ల మేర ఉన్నాయి. సీఆర్ఎంపీ రోడ్లలో 2,487 సైన్బోర్డులు ఏర్పాటు చేయగా, తాజాగా ఇతర రహదారులపై వేగ నియంత్రణ బోర్డులు ఏర్పాటు,చేస్తున్నారు.