మేడ్చల్, నవంబర్ 17: బోధన విద్యార్థి కేంద్రీకృతంగా ఉండాలని, చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన ఉపాధ్యాయులకు సూచించారు. మేడ్చల్ పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో గురువారం జరిగిన స్కూల్ కాంప్లెక్స్ల సమావేశాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మౌలిక భాషాగణిత సామర్థ్యాల సాధన కార్యక్రమం (ఎఫ్ఎల్ఎన్) తొలిమెట్టుపై చర్చించారు. మేడ్చల్లో తొలిమెట్టు అమలు తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా విద్యాశాఖ అధికారి విజయకుమారి మాట్లాడుతూ పాఠశాల డైరెక్టర్ సూచనల మేరకు సామర్థ్యాలు తక్కువగా ఉన్న విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారు.
అనంతరం ఎఫ్ఎల్ఎన్ అమలులో ఉత్తమ పాఠశాలలుగా ఎంపికైన నూతన్కల్, అత్వెల్లి, రావల్కోల్ తండా, మునీరాబాద్, అర్కెలగూడెం, పూడూరు, జడ్పీ బాలుర, గుండ్లపోచంపల్లి, గౌడవెల్లి, మేడ్చల్ ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులను డైరెక్టర్ దేవసేన, జిల్లా విద్యాశాఖ అధికారి విజయకుమారి సన్మానించారు. ఈ కార్యక్రమంలో సెక్టోరియల్ అధికారి రవీందర్ రాజు, మండల నోడల్ అధికారి రంగాచారి, క్లస్టర్ నోడల్ అధికారులు డాక్టర్ శ్రీధర్, రామారావు, మధుసూదన్ రెడ్డి, ఎన్సీఈఆర్టీ ఆర్పీలు శ్రీధరాచారి, త్రివేణి తదితరులు పాల్గొన్నారు.