మొబైల్ వాహనంలో పరీక్షలు .. 040- 2111 1111కు ఫోన్ చేయండి .. నేడు మొబైల్ వాహనం ప్రారంభం
సిటీబ్యూరో, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ ) : రోడ్డు పక్కన మిర్చీ బండి.. ఫాస్ట్ఫుడ్ సెంటర్..ఫైవ్ స్టార్ హోటల్..స్థాయి ఏదైనా వాటిలో లభించే ఆహార పదార్థాల్లో అక్కడక్కడా ఏదో ఒక రూపంలో కల్తీ జరుగుతోందని ఆహార పరిరక్షణ సంస్థ నిర్వహిస్తున్న తనిఖీల్లో వెల్లడవుతున్న వాస్తవాలు. టీ పొడి, పాలు, పండ్లు, పప్పులు, సాస్లు, చక్కెరతో చేసే మిఠాయిలు, నూనె, కారంపొడి, బేకరీ ఉత్పత్తులు, నిల్వ తీపి పదార్థాలు, హోటళ్లలో తయారు చేసిన ఆహారాల వరకు కొన్ని స్టాల్స్లో నాణ్యత ప్రమాణాలు లోపించాయని తనిఖీలు స్పష్టం చేస్తున్నాయి. కొరవడిన ప్రమాణాలు సగటు మనిషి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలోనే ఆహార నాణ్యత విషయంలో మరింత కఠినంగా వ్యవహరించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది.
ఆహార నాణ్యత విషయంలో అనుమానం ఉంటే అక్కడికక్కడే పరీక్షలు నిర్వహించి నిర్ధారించనున్నారు. ప్రయోగాత్మకంగా హైదరాబాద్లో తొలి మొబైల్ ల్యాబ్ను శుక్రవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రారంభించనున్నారు. ఈ మొబైల్ వాహనంలో అక్కడికక్కడే నాణ్యతను నిర్ధారించనున్నారు. హానికరం, నకిలీ (మిస్ బ్రాండెడ్), నాసిరకం ఇలా మూడు రకాల ప్రమాణాలపై పరీక్షలు జరుపుతారు. కల్తీ ఉన్నట్లు గుర్తిస్తే అవగాహన, చైతన్యం కలిగించి ముందస్తుగా హెచ్చరికలు జారీ చేస్తారు. మరోమారు పునరావృతం అయితే జరిమానాలు, శిక్ష విధిస్తారు. ప్రతి రోజూ ఒక్కో సర్కిల్లో పర్యటించి ఆహార నాణ్యతల నిగ్గు తేల్చే పనిలో జీహెచ్ఎంసీ నిమగ్నమైంది. ఆహార నాణ్యత ప్రమాణాల విషయంలో అనుమానాలుంటే జీహెచ్ఎంసీ టోల్ ఫ్రీ నంబరు 040- 2111 1111లో సంప్రదించాలని అధికారులు కోరారు.