మాదాపూర్/బంజారాహిల్స్ , నవంబర్ 17: హైకోర్టు మాజీ న్యాయమూర్తి, లోకాయుక్త మాజీ జస్టిస్ సీతారాం రెడ్డి (94) కన్నుమూశారు. జూబ్లీహిల్స్ రోడ్ నం 36లోని కావూరిహిల్స్లో నివాసముంటున్న జస్టిస్ సీతారాంరెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతి చెందారు. ఆయన మరణవార్త తెలుసుకున్న పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులతో పాటు ఆయన బంధువులు మాదాపూర్ కావూరిహిల్స్లోని నివాసంలో సీతారాంరెడ్డి భౌతిక కాయాన్ని హ్యూమన్ రైట్స్ కమిషన్ జస్టిస్ చంద్రయ్య, సుప్రీం కోర్టు రిటైర్ జడ్జి సుభాష్రెడ్డి, మాజీ మంత్రి సమరసింహారెడ్డి, తెలంగాణ హైకోర్టు జడ్జి విజయ్సేనా రెడ్డి, లోకాయుక్తా సభ్యులు శ్రీరాములు, వెంకట్రామ్రెడ్డి, జస్టిస్ యతిరాజులు, జస్టిస్ జీవన్రెడ్డిలతో పాటు పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు, వ్యాపారవేత్తలు సందర్శించి నివాళులర్పించారు.
గురువారం సాయంత్రం జూబ్లీహిల్స్లోని మహా ప్రస్థానంలో జస్టిస్ సీతారాంరెడ్డి అంత్యక్రియలు పూర్తయ్యాయి.మహబూబ్నగర్ జిల్లా అలంపూర్లో జన్మించిన సీతారాంరెడ్డికి 1958లో మనోరమ దేవితో వివాహం జరిగింది. వారికి అనితారెడ్డి, కవితారెడ్డి, మహితారెడ్డి, కీర్తిరెడ్డి సంతానం. సీతారాంరెడ్డి నిజాం కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. లండన్లో న్యాయవిద్యను అభ్యసించి ఉస్మానియా గ్రాడ్యుయేట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కొనసాగారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్సీగా కూడా పనిచేశారు. 1958-1970 వరకు ఉస్మానియా లా కళాశాలలో లెక్చరర్గా పనిచేస్తూ న్యాయవ్యవస్థలో అధ్యక్షుడిగా కొనసాగారు. 1960-1968 వరకు మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ ఆఫ్ కౌన్సిల్ సభ్యుడిగా పనిచేశారు. 1988-1973 వరకు ఐఎల్ఆర్ (ఆంధ్రప్రదేశ్) సిరీస్లో ఎడిటర్గా ఆ తరువాత 1974-1978 వరకు మెంబర్ ఆఫ్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా కొనసాగారు. 1974 అక్టోబర్లో ఏపీ హై కోర్టులో ప్రభుత్వ ప్లీడర్గా పనిచేశారు. 1978 నవంబర్ 10న ఏపీ హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేశారు. మార్చి 1990-1995 వరకు ఏపీ లోకాయుక్తాలో న్యాయమూర్తిగా విధులు నిర్వహించిన అనంతరం 1989 -1996 వరకు ఆర్బీవీఆర్ఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షుడిగా పనిచేశారు.