సిటీబ్యూరో, నవంబర్ 17 (నవంబర్): ఆలిండియా పర్మిట్తో నకిలీ గన్ లైసెన్స్ తయారు చేసి.. వాటి ద్వారా అసలైన తుపాకులను సమకూర్చారు. ఇతర రాష్ర్టాలకు చెందిన నిరుద్యోగ యువతకు సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాలు కల్పిస్తూ మోసం చేస్తున్న ఘరానా ముఠాను పశ్చిమ మండలం టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠా నుంచి 34 తుపాకులు, 34 నకిలీ గన్ లైసెన్స్, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
బంజారాహిల్స్ ఐసీసీసీలోని నగర పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో గురువారం పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ వివరాలను వెల్లడించారు. జమ్మూ కశ్మీర్(జేకే) రాజోరి జిల్లాకు చెందిన అల్తాఫ్ హుస్సేన్ 2013లో జీవనోపాధి కోసం హైదరాబాద్కు వచ్చి గ్రేస్ మేనేజ్మెంట్ సెక్యూరిటీ సర్వీస్లో చేరాడు. అనంతరం వెస్ట్మారేడ్పల్లిలోని ఎస్ఐఎస్ క్యాష్ మేనేజ్మెంట్ సర్వీస్లో గన్మెన్గా పనిచేశాడు. ఈ సమయంలోనే తన స్వస్థలం రాజోరికి వెళ్లి అక్కడ మేజిస్ట్రేట్ కార్యాలయంలో కొందరికి లంచాలు ఇచ్చి.. నకిలీ గన్ లైసెన్స్ తెచ్చుకున్నాడు. ఆ లైసెన్స్తోనే అసలు తుపాకీ కొనుగోలుచేసి, తిరిగి నగరానికి వచ్చాడు.
ఆ నకిలీ లైసెన్స్ను ఎవరూ గుర్తించలేదు. ఆ తర్వాత తానే స్వయంగా ఆయుధాలకు సంబంధించిన నకిలీ లైసెన్స్ తయారు చేయడం ప్రారంభించాడు. ఇందులో భాగంగా సికింద్రాబాద్కు చెందిన హఫీజుద్దీన్ అనే ఒక స్టాంప్ వెండర్ను తన మోసాలలో భాగస్వామిని చేసుకున్నాడు. అతడు నకిలీ స్టాంప్లు, ప్రభుత్వ కార్యాలయాల సీల్ తయారు చేసి అందించాడు. గ్రేస్ సెక్యూరిటీ సర్వీసెస్, రీజినల్ మేనేజర్ వెంకట కొండారెడ్డిని, వెస్ట్మారేడ్పల్లిలో ఉన్న జిరాక్స్ షాప్ యజమాని ఐ.శ్రీనివాస్ను కూడా తన గ్యాంగ్లో చేర్చుకున్నాడు.
సెక్యూరిటీ గార్డులుగా కశ్మీర్ యువత..
సెక్యూరిటీ గార్డుగా పనిచేసేందుకు ఆసక్తి ఉన్న జమ్మూ- కశ్మీర్ యువతను నిందితులు హైదరాబాద్కు రప్పించారు. ఆలిండియా పర్మిట్తో వారికి నకిలీ ఆయుధాల లైసెన్స్ అందించి.. రూ. 20 వేల నుంచి రూ. 60 వేలు వరకు వసూలు చేశారు. వారు ఆ లైసెన్స్ ద్వారా పుణే, నాగపూర్లో అసలైన ఆయుధాలు కొనుగోలు చేసి, హైదరాబాద్కు తిరిగి వచ్చారు. వారిని ఏషియన్ సెక్యూరిటీ సర్వీసెస్, నందమూరి సెక్యూరిటీ అండ్ సర్వీసెస్, గ్రేస్ మేనేజ్మెంట్ సెక్యూరిటీ సర్వీసెస్లో సెక్యూరిటీ గార్డులుగా నియమించుకుంటున్నారు. వీరిని వీవీఐపీ, జ్యువెలరీ షోరూమ్స్, ఏటీఎం, వ్యక్తిగత సెక్యూరిటీగా నియమించుకుంటున్నారు.
టాస్క్ఫోర్స్కు చిక్కారు..
వెస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులకు వచ్చిన సమాచారంతో టాస్క్ఫోర్స్ డీసీపీ(ఓఎస్డీ) రాధాకిషన్రావు ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. జమ్మూ కశ్మీర్లోని రాజోరి జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయం పేరుతో జారీ అయిన గన్ సర్టిఫికెట్లపై అక్కడ కార్యాలయంలో ఆరా తీయగా.. అవి నకిలీవని తేలింది. దీంతో అల్తాఫ్ హుస్సేన్, హఫీజుద్దీన్, వెంకట కొండారెడ్డి, శ్రీనివాస్తో పాటు మూడు సెక్యూరిటీ ఏజెన్సీల నిర్వాహకులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 34 తుపాకులు, 140 రౌండ్లు, 34 నకిలీ ఆయుధాల లైసెన్స్ బుక్స్, రబ్బర్ స్టాంప్లు స్వాధీనం చేసుకున్నారు.
ప్రజా భద్రతకు ముప్పు
గన్ లైసెన్స్ జారీ చేయడం, రెన్యూవల్ చేసేది పోలీస్ శాఖ అని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఇలాంటి నకిలీ లైసెన్స్తో తుపాకులు కలిగి ఉండటం ప్రజా భద్రతకు ముప్పని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర స్థాయితో పాటు ఆలిండియా స్థాయిలో ఆయుధాలకు సంబంధించిన లైసెన్స్ జారీ అవుతాయన్నారు. నకిలీ లైసెన్స్ ఆలిండియా స్థాయిలో జారీ అయినట్లు నిందితుడు సృష్టించాడని సీపీ వివరించారు. ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలు తప్పనిసరిగా సెక్యూరిటీ ఏజెన్సీ రెగ్యులేషన్ యాక్ట్(పీఎస్ఏఆర్ఏ) పాటించాలన్నారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో అన్ని పోలీస్ కమిషనరేట్లు, జిల్లా కలెక్టర్లను అప్రమత్తం చేస్తామని సీపీ తెలిపారు.
త్వరలోనే ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలతో సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు. స్వచ్ఛందంగా వారి వద్ద ఉన్న ఆయుధాల గూర్చి వెల్లడించాలన్నారు. ప్రైవేట్ ఏజెన్సీలకు కూడా లైసెన్స్ జారీ చేస్తామన్నారు. ఈ సందర్భంగా టాస్క్ఫోర్స్ డీసీపీ రాధాకిషన్రావు, వెస్ట్జోన్ ఇన్స్పెక్టర్ ఖలీల్ పాషా, ఎస్సైలు రంజిత్కుమార్, మల్లికార్జున్, ఎండీ ముజఫర్ అలీ, చంద్రమౌళి తదితర సిబ్బందిని సీపీ అభినందించారు.