కొండాపూర్, నవంబర్ 17: చందానగర్ పరిధిలో ఓ మహిళను హత్యచేసిన దుండగులు.. ఆమె ఒంటిపై ఉన్న బంగారు నగలతో ఉడాయించారు. చందానగర్ ఇన్స్పెక్టర్ క్యాస్ట్రోరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగండ్లలో నివాసం ఉంటున్న వడ్డె యాదమ్మ (47) కూలీ. ఆమె కుటుంబ సభ్యులు కూడా అక్కడే ఉంటారు. బుధవారం ఉదయం యాదమ్మ కుమారుడు, కోడలు పనులకు వెళ్లి, తిరిగి సాయంత్రం ఇంటికి వచ్చారు. యాదమ్మ పెద్ద కుమారుడి కుమార్తె భాగ్యలక్ష్మి భోజనం చేసేందుకు రమ్మని పిలిచేందుకు నానమ్మ (యాదమ్మ) వద్దకు వెళ్లింది. అక్కడి దృశ్యం చూసిన భాగ్యలక్ష్మి భయంతో తిరిగి తండ్రి వద్దకు వెళ్లింది.
నానమ్మ ముఖంపై దిండు ఉన్నదని, పిలిచినా పలకడం లేదని చెప్పింది. దీంతో అతడు తల్లి వద్దకు వచ్చి చూడగా.. ముఖంపై దిండు కనిపించింది. పరిశీలించగా అప్పటికే చనిపోయి ఉంది. ఆమె గదిలో బీడీలు, సిగరేట్లు, గుట్కా ప్యాకెట్లు కనిపించాయి. ఆమె మృతదేహాన్ని పరిశీలించగా.. ఆమె చెవికి ఉన్న దిద్దులు, చేతి ఉంగరాలు, మ్యాట్నీలు, నెక్లెస్, వెండి చీలమండలు, పట్టీలు కనిపించలేదు. తన తల్లిని హత్య చేసిన దుండగులు.. ఆమె ఒంటిపై ఉన్న నగలు దోచుకెళ్లారంటూ మృతురాలి కుమారుడు చందానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.