జవహర్నగర్, నవంబర్ 17: రాష్ట్రంలో ప్రజాసంక్షేమం, అభివృద్ధికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. గురువారం జవహర్నగర్ కార్పొరేషన్లో తాసీల్దార్ అనిత అధ్యక్షతన తాసీల్దార్ మీటింగ్ హాల్లో మంత్రి మల్లారెడ్డి, అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్య, మేయర్ మేకల కావ్య, డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్లతో కలిసి కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ఆడబిడ్డల తల్లిదండ్రులకు ఆర్థిక కష్టాలను తీర్చడానికి సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టారన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా దళితుల సంక్షేమం కోసం ప్రభుత్వం దళితబంధు పథకం ప్రవేశపెట్టిందని తెలిపారు. అనంతరం 49మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కమిషనర్ రామకృష్ణారావు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ విశ్వనాథ్, కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, పార్టీ అధ్యక్షుడు కొండల్ ముదిరాజ్, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
వెజ్, నాన్వెజ్ మార్కెట్ పనుల పరిశీలిన…
కార్పొరేషన్లో రెండెకరాల విస్తీర్ణంలో చేపట్టిన సమీకృత వెజ్, నాన్వెజ్ మార్కెట్ పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కార్పొరేషన్ అభివృద్ధిలో అధికారులు, పాలకవర్గం సభ్యులు ముందుండాలని, గ్రూపులు వద్దని సూచించారు.
సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం
సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరమని మంత్రి మల్లారెడ్డి అన్నారు. మండల కేంద్రానికి చెందిన మచ్చాని శివకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి వైద్య సహాయ నిమిత్తం రూ. లక్ష చెక్కు మంజూరైంది. ఈ చెక్కును లబ్ధిదారుడికి మంత్రి గురువారం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాలకు సముచిత న్యాయం జరుగుతున్నదన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు జె.సుధాకర్రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ వెంకటేశ్, సోషల్ మీడియా అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్, మండల టీఆర్ఎస్ నాయకులు వెంకటేశ్, బాల్రాజ్, గణేశ్, బన్నీ, సతీశ్ యాదవ్, వెంకటేశ్, మహేశ్, వెంకటేశ్, లతతో పాటు పలువురు పాల్గొన్నారు.
నిధులు కేటాయించాలని వినతి..
మండల పరిధిలోని భోగారం , మండల టీఆర్ఎస్ (బీఆర్ఎస్) నేతలు మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. భోగారం గ్రామాభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని మంత్రి మల్లారెడ్డిని కోరారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు సుధాకర్రెడ్డి, బోగారం కో-ఆప్షన్ సభ్యులు నర్సింహా రెడ్డి, నాయకులు పడమటి నర్సింహా రెడ్డి, సత్యనారాయణ, ప్రవీణ్ కుమార్, భోగారం గ్రామానికి చెందిన నాయకులు పాల్గొన్నారు.