సిటీబ్యూరో, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): గోవాలో డ్రగ్ మాఫియా కింగ్ పిన్గా చలామణి అయిన ఎడ్విన్ అంజునా సర్పంచ్గా కూడా పనిచేసినట్లు విచారణలో వెల్లడైంది. ఇటీవలే హెచ్న్యూ(హైదరాబాద్ నార్కొటిక్ ఎన్ఫోర్స్మెంట్) ఎడ్విన్ను కస్టడీలోకి తీసుకొని విచారించడంతో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. గోవాలోని అంజునా ప్రాంతానికి చెందిన ఎడ్విన్ తన 11వ యేట ఒక హోటల్లో వెయిటర్గా పనిచేస్తూ, విదేశీయులతో పరిచయాలు ఏర్పరుచుకొని, 19 ఏండ్ల వయస్సులో డ్రగ్స్ దందాలోకి దిగాడు.
అంజునా బీచ్లో… షాక్స్పబ్..
1997లో రూ. 50 వేలతో అంజునా బీచ్ ఒడ్డున షాక్స్ పబ్ పేరుతో వ్యాపారం మొదలు పెట్టాడు. అనంతరం కర్లీస్ షాక్స్గా పబ్ పేరు మార్చాడు. 4 టేబుళ్లతో ప్రారంభించి, దానిని 180 టేబుళ్లుగా విస్తరించాడు. విదేశీయులతో పరిచయాలు ఉండటంతో వారు వచ్చే సమయంలో సింథటిక్ డ్రగ్స్ను తీసుకొచ్చి ఎడ్విన్కు ఇచ్చేవారు. డ్రగ్స్ తెచ్చే వాళ్లకు అవసరమైన ఏర్పాట్లు చేసి, తన హోటల్స్లో ఉచిత వసతి కల్పించడంతో పాటు, వారికి గంజాయి ఉచితంగా సరఫరా చేయించే వాడు. ఇలా విదేశాల నుంచి వచ్చిన వాళ్లు నెలల తరబడి ఇక్కడే ఉంటూ తిరిగి తమదేశానికి వెళ్లి, కనీసం సంవత్సరానికి ఒకసారైనా గోవాకు వచ్చేవారు.
ఇలా రెగ్యులర్గా ప్రతి నెల కావాల్సినంతా డ్రగ్ ఎడ్విన్కు అందుతుండేవి. దీంతో దేశ వ్యాప్తంగా ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని డ్రగ్స్ను సరఫరా చేస్తూ భారీగా ఆస్తులు కూడా బెట్టాడు. 2008లో అంజునా సర్పంచ్గా కూడా ఎడ్విన్ పనిచేయడంతో రాజకీయ నాయకులతో పరిచయాలున్నాయి. ఒక పక్క డ్రగ్స్, మరో పక్క రాజకీయం, ఇంకో పక్క పోలీస్ వ్యవస్థ మొత్తం తన గుప్పిట్లో ఉండటంతో కరోనా వచ్చేంత వరకు భారీ ఎత్తున డ్రగ్స్ దందా నిర్వహించాడు. కరోనాతో విదేశీయుల రాక తగ్గడంతో సరఫరా కూడా తగ్గింది, తిరిగి మాములు పరిస్థితులు నెలకొంటుండటంతో పాత నెట్వర్క్ను మొత్తం తిరిగి యాక్టివేట్ చేసే ప్రయత్నంలో ఎడ్విన్ ఉన్నాడు.
భారీగా ఆస్తులు…
గోవాలో మూడు ప్రీమియం హోటల్స్, పరిసర ప్రాంతాల్లో భారీగా పొలాలు, పుణేలోని తన మామ సెబాస్టియన్ చేసే నిర్మాణ రంగంలో పెట్టుబడులు పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. తన పబ్బులలో ప్రతి సోమ, గురువారాల్లో రేవ్పార్టీలు ఏర్పాటు చేసేవాడు. ఈ రేవ్ పార్టీల్లో భారీ ఆదాయాన్ని టార్గెట్ చేస్తూ డ్రగ్స్ సరఫరా చేసేవాడు. ఆ రెండు రోజుల్లోనే రూ. 50 లక్షల వరకు ఆదాయం వచ్చేదని, మిగతా రోజుల్లో మాములుగా ఉండేదని పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది.