మేడ్చల్, నవంబర్15(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరానికి సమీపంలో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కండ్లకోయలో నిర్మించనున్న గేట్వే ఐటీ పార్క్లో ఐటీ సంస్థల ఏర్పాటుకు అనేక దరఖాస్తులు వస్తున్నాయి. ఇప్పటికే 7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐటీ సంస్థల ఏర్పాటుకు సుమారు 200 పైచిలుకు ఐటీ కంపెనీలు దరఖాస్తులు చేసి రిజిస్ట్రేషన్లు చేసుకున్నాయి.
గేట్వే ఐటీ పార్క్లో మరిన్ని ఐటీ కంపెనీలు ఏర్పాటుకు ముందుకు వస్తున్న నేపథ్యంలో వైశాల్యాన్ని పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. 22 లక్షల ఎస్ఎఫ్టీని రూ.998 కోట్లతో పెంచేలా టీఎస్ఐఐసీ ప్రణాళికను సిద్ధం చేసింది. దీనికి సంబంధించి టెండర్లను ఆహ్వానించగా.. ప్రసుత్తం టెండర్ ప్రక్రియ పురోగతిలో ఉన్నదని టీఎస్ఐఐసీ అధికారులు వెల్లడించారు. వచ్చే నెలలో టెండర్ ప్రక్రియ పూర్తి కానున్నది. ఐటీ పార్క్ నిర్మాణ పనులను దక్కించుకున్న కాంట్రాక్టర్లు 36 నెలల్లో పనులను పూర్తి చేయాల్సి ఉంటుంది. 10 ఎకరాల విస్తీర్ణంలో 22 లక్షల ఎస్ఎఫ్టీని నిర్మించనుండగా, ఇందులో 11 లక్షల ఎస్ఎఫ్టీ ఐటీ కంపెనీల కోసం, మరో 11 లక్షల ఎస్ఎఫ్టీ విస్తీర్ణాన్ని ఇతర వాణిజ్య అవసరాలకు కేటాయించే విధంగా నిర్ణయం తీసుకున్నారు.
త్వరలో పనులు ప్రారంభం
గేట్వే ఐటీ పార్క్ పనులు త్వరలోనే ప్రా రంభం కానున్నాయి. హైదరాబాద్ నగరానికి ఉత్తరాన ఐటీ పార్క్ ఉండాలన్న ఉద్దేశంతో మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ తీసుకు న్నారు. ఫలితంగా మేడ్చల్కు ఐటీ పార్క్ వచ్చింది. ఐటీ పార్క్ నిర్మాణ పనులు త్వరగా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. అన్ని సౌకర్యాలు ఉన్న మేడ్చల్ జిల్లాలో ఐటీ పార్క్ నిర్మించడం వల్ల నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ ఉమ్మడి జిల్లాల ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుంది. – కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి
వివిధ ఐటీ కంపెనీల నుంచి దరఖాస్తులు
గేట్వే ఐటీ పార్క్లో వివిధ దేశాలకు చెందిన ఐటీ సంస్థలు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకుంటున్నారు. దరఖాస్తులు చేసుకున్న ఐటీ సంస్థల వివరాలను టీఎస్ఐఐసీ అధికారులకు అందిస్తున్నాం. గేట్వే ఐటీ పార్క్ ఎస్ఎఫ్టీని పెంచాలని మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో ఎస్ఎఫ్టీ పెంపునకు ఆదేశాలు ఇచ్చారు.
– ఓరుగంటి వెంకట్, కొంపల్లి ఐటీ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్(కైటీయా)