తెలుగు యూనివర్సిటీ, నవంబర్ 15: జానపద కళారూపాలను కులాలకు అతీతంగా లింగభేదం లేకుండా ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాయం ఉపాధ్యక్షుడు ఆచార్య టి. కిషన్రావు అన్నారు. మట్టి మనుషులు వేదిక ఆధ్వర్యంలో వర్సిటీ సమావేశమందిరంలో ఆచార్య జయధీర్ తిరుమలరావు రచన తొవ్వ ముచ్చట్లు పుస్తకావిష్కరణ సభ మంగళవారం సాయంత్రం జరిగింది. ఆచార్య కిషన్రావు పాల్గొని తొవ్వ ముచ్చట్లు ఏడో భాగం పుస్తకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. కొత్త కొత్త ఆలోచనలతో జానపద కళారూపాలు అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. తిరుమలరావు ప్రయాణంలో సాహిత్య, సంగీత, కళారూపాల తీరుతెన్నులను తొవ్వ ముచ్చట్లు పుస్తకంలో అద్భుతంగా చిత్రిక కట్టారని తెలిపారు. ప్రముఖ సాహితీవేత్త ఎ.కె ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఓయూ ప్రొఫెసర్ డి.రవీందర్,అలయన్స్ ఫ్రాన్సెస్ డైరక్టర్ డాక్టర్ శ్యామ్యూల్ బెర్ట్హెట్, జానపద సంగీత విద్వాంసుడు దాసరి కొండప్ప, పి. శ్రీశైల్రెడ్డి, టి. ప్రకాశ్, జిలుకర శ్రీనివాస్, జి.ఎస్ రామ్మోహన్, ప్రొఫెసర్ జి.మనోజ, వి.పాండురంగరావు పాల్గొన్నారు.