గృహ విక్రయాల్లో హైదరాబాద్ అ‘ధర’హో అనిపిస్తోంది. ఈ త్రైమాసికంలో గ్రేటర్ పరిధిలో 4 శాతం పెరుగుదల నమోదైంది. కేవలం మూడు నెలల కాలంలోనే 11,650 యూనిట్ల విక్రయాలు జరిగాయి. దేశంలోని ఏడు మెట్రో నగరాల్లో జరిగిన కొనుగోళ్లతో పోలిస్తే ఇది 13 శాతం. మరోవైపు నగరంలో ఇంటి అద్దెలు కూడా 2 నుంచి 5 శాతానికి పెరిగినట్లు అన్రాక్ సంస్థ నివేదికలో వెల్లడైంది.
సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, నవంబరు 15 (నమస్తే తెలంగాణ): మహా నగర పరిధిలో గృహ అమ్మకాల్లో పెరుగుదల నమోదైంది. ఈ ఏడాది మూడు త్రైమాసికాలపై అన్రాక్ అనే సంస్థ ఇచ్చిన నివేదికలో మునుపటి రెండు త్రైమాసికాలతో పోలిస్తే అమ్మకాల తీరు మెరుగ్గా ఉందని వెల్లడైంది. ఇదే క్రమంలో మహా నగరంలోని అన్ని ప్రాంతాల్లో నిర్వహించిన సర్వేలో చదరపు అడుగునకు ధరల పెరుగుదల కనిపించడంతో పాటు ఇంటి అద్దెలు కూడా గతంతో పోలిస్తే పెరిగినట్లుగా తేలింది.
హైదరాబాద్ మహా నగరంలో సెంట్రల్ జోన్ పరిధిలోకి వచ్చే అమీర్పేట, పంజాగుట్ట, సోమాజిగూడ, హిమాయత్నగర్, కాచిగూడ, ఖైరతాబాద్.. నార్త్ జోన్ పరిధిలోని మియాపూర్, దుండిగల్, మేడ్చల్, శామీర్పేట, పోచారం, బాచుపల్లి, నిజాంపేట, బొల్లారం, యాప్రాల్.., ఈస్ట్ జోన్లోఎల్బీనగర్, నాగోల్, ఉప్పల్, హబ్సీగూడ, ఘట్కేసర్, నాచారం, పీర్జాదిగూడ, వనస్థలిపురం… వెస్ట్లో గచ్చిబౌలి, కొండాపూర్, తెల్లాపూర్, మణికొండ, కూకట్పల్లి, అత్తాపూర్, కోకాపేట, పటాన్చెరు, మాదాపూర్, అప్పా జంక్షన్ ప్రాంతాల్లో వచ్చిన గృహ ప్రాజెక్టులు, వాటి అమ్మకాలు ధరల పెరుగుదల, ఇంటి అద్దెలపై ఈ సంస్థ సర్వే నిర్వహించింది. ఈ సంవత్సరం రెండు త్రైమాసికాల్లో స్వల్ప ప్రతికూల పరిస్థితి ఉండటంతో ఈ ఏడాది జూలై నుంచి సెప్టెంబర్ (మూడో త్రైమాసికం) వరకు కొత్తగా 15,500 గృహ యూనిట్లు అందుబాటులోకి వచ్చాయి.
రెండో త్రైమాసికంతో పోలిస్తే ఈ సంఖ్య రెండు శాతం తక్కువ. కానీ అమ్మకాలు మాత్రం గత రెండు త్రైమాసికాల కంటే ఎక్కువగా ఉన్నాయి. మూడు నెలల్లో 11,650 యూనిట్లు అమ్ముడుపోయాయి. రెండో త్రైమాసికంతో పోలిస్తే అమ్మకాల్లో నాలుగు శాతం పెరుగుదల నమోదైంది. దేశంలోని ఏడు ప్రధాన మెట్రో నగరాల్లో అమ్ముడుపోయిన యూనిట్లలో ఇది 13 శాతమని అన్రాక్ నివేదిక తెలిపింది. ఈ అమ్మకాల్లో చదరపు అడుగునకు సరాసరి ధర రూ.4,590 అని పేర్కొంది. ఈ అమ్మకాల తర్వాత ప్రస్తుతం మహా నగరవ్యాప్తంగా గతంలోని పెండింగుతో కలుపుకొని 79,700 యూనిట్లు అందుబాటులో ఉన్నాయి.
పోటీపడుతున్న నార్త్ జోన్..
హైదరాబాద్ పరిధిలో వెస్ట్ జోన్లోనే రియల్, నిర్మాణ రంగం మిగిలిన అన్ని జోన్ల కంటే ముందు వరుసలో ఉంటుంది. అయితే గత కొంత కాలంగా నార్త్ జోన్ కూడా వెస్ట్తో పోటీపడుతుంది. అందుకే మూడో త్రైమాసికంలో నమోదైన అమ్మకాల్లో వెస్ట్ పరిధిలో 53 శాతం అమ్మకాలు ఉంటే.. నార్త్ పరిధిలో 38 శాతం ఉన్నాయి. మునుపటితో పోలిస్తే నార్త్లో ఆరు శాతం పెరుగుదల నమోదు కావడం విశేషం. మిగిలినవాటిలో సౌత్ సిటీలో 5 శాతం, ఈస్ట్ సిటీలో 4 శాతం మాత్రమే అమ్మకాలు జరిగాయి. రూ.40 లక్షల్లోపు గృహాలు కేవలం ఒకే ఒక్క శాతం ఉన్నాయంటే తక్కువ విస్తీర్ణాన్ని కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రావడంలేదని అర్థమవుతున్నది.