సిటీబ్యూరో, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ)/అమీర్పేట్: పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నగరంలో మౌలిక వసతుల కల్పనకు జీహెచ్ఎంసీ విశేష కృషి చేస్తున్నదని మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. ఈఎస్ఐ ఎర్రగడ్డ వద్ద రూ.5 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఫుట్ ఓవర్ బ్రిడ్జిని హోంమంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో కలిసి సోమవారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రారంభించారు. రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మార్గదర్శకత్వంలో నగరంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నట్లు మేయర్ పేర్కొన్నారు. గత ఐదేండ్ల కాలంలో గ్రేటర్ పరిధిలో రవాణా వ్యవస్థను మెరుగు పరిచేందుకు ఎస్ఆర్డీపీ ద్వారా, ఫ్లై ఓవర్లు, ఆర్ఓబీలు, అండర్ పాస్లు, సీఆర్ఎంపీ ద్వారా సుమారు 700 కిలోమీటర్ల రోడ్డు, లోతట్టు ప్రాంతాల్లో, వరద ముంపు నివారణకు ఎస్ఎన్డీపీ ద్వారా నాలాల అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు.
100 కోట్లతో 38 ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు
పాదచారుల భద్రత, ప్రమాదాల నివారణకు 38 ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లు మంజూరు చేసిందని మేయర్ విజయలక్ష్మి తెలిపారు. రూ.75.65 కోట్ల వ్యయంతో 22 ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను చేపట్టగా ఇప్పటి వరకు ఎనిమిది ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు అందుబాటులోకి వచ్చాయని అన్నారు. మిగతా ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి అందుబాటులోకి తేనున్నట్లు పేర్కొన్నారు. రద్దీ ఎకువగా ఉండే ఎర్రగడ్డ ప్రాంతంలో పాదచారులకు ఈ ఎఫ్వోబీ ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. రాబోయే రోజుల్లో 4300 మంది పాదచారులకు ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో చీఫ్ విప్ ఎంఎస్ ప్రభాకర్, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, కార్పొరేటర్లు షాహిన్ బేగం, కొలన్ లక్ష్మీరెడ్డి, జోనల్ కమిషనర్ శంకరయ్య, ఎస్సీ శంకర్నాయక్, యూసుఫ్గూడ, ఖైరతాబాద్ డీసీలు రమేశ్, మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.