హైదరాబాద్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ) : ఆరాంఘర్ చౌరస్తా – శంషాబాద్ ఎయిర్ పోర్ట్ మార్గంలో రోడ్డు అభివృద్ధి, విస్తరణ పనులను మరింత వేగవంతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం హైదారాబాద్లోని బీఆర్కేఆర్ భవన్లో ఆర్అండ్బీ, ట్రాన్స్కో, రెవెన్యూ, ఎండోమెంట్స్, వక్ఫ్బోర్డు తదితర శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రూ.283 కోట్ల వ్యయంతో 10 కిలోమీటర్ల మేర ఆరు లైన్ల రోడ్డు విస్తరణ, రెండు సర్వీస్ రోడ్ల పనులు చేపట్టారు. వీటితోపాటు, వ్యవసాయ విశ్వవిద్యాలయం, సాతంరాయి, ఎయిర్ పోర్ట్ ప్రవేశ మార్గాల వద్ద అండర్ పాస్లు, గగన్ పహాడ్ వద్ద ఫ్లై ఓవర్, శంషాబాద్ టౌన్లో ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్ ఆదేశాలతో రోడ్డు విస్తరణ పనుల పురోగతిపై సీఎస్ చర్చించారు.
ఈ సందర్భంగా సోమేశ్ కుమార్ మాట్లాడుతూ రోడ్డు విస్తరణ పనులతో ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చూడాలన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రోడ్డు విస్తరణకు అడ్డంకిగా ఉన్న విషయాలపై ప్రజాప్రతినిధులతో వెంటనే సమావేశం నిర్వహించాలని చెప్పారు. ఈ ఏడాది డిసెంబర్ నెలాఖరులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ట్రాఫిక్ నిర్వహణ కోసం పోలీస్ శాఖ సేవలను వినియోగించుకోవాలని చెప్పారు. రోడ్డు విస్తరణ పనుల పురోగతిపై తానే స్వయంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానని సీఎస్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో రోడ్లు, భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, దేవాదాయ శాఖ కార్యదర్శి అనిల్కుమార్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్కుమార్, వక్ఫ్బోర్డు కార్యనిర్వహణ అధికారి షాన్వాజ్ ఖాసీమ్, విద్యుత్ శాఖ డైరెక్టర్ శ్రీనివాస్ రావు, కేంద్ర ప్రభుత్వ రహదారుల శాఖ ప్రాంతీయ అధికారి ఖుషావా, ట్రాన్స్కో డైరెక్టర్ జగత్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ధర్మారెడ్డి, రాజేంద్రనగర్ ఆర్డీవో చంద్రకళ, శంషాబాద్ ఏసీపీ భాసర్, తదితరులు పాల్గొన్నారు.