ఖైరతాబాద్, నవంబర్ 11 : వ్యాపార, వాణిజ్య కేంద్రాలు నిర్వహిస్తున్న వారికి ట్రెడ్ లైసెన్సులు తప్పనిసరి. ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ సర్కిల్లో కొందరు ఎలాంటి ట్రేడ్ లైసెన్సులు లేకుండా వ్యాపారాలు సాగిస్తున్నారు. మరికొందరు ట్రెడ్ లైసెన్సుకు సంబంధించిన ఫీజు చెల్లించకుండా ఏండ్ల తరబడి పెండింగ్లో పెట్టారు. ఆలాంటి వారిపై జీహెచ్ఎంసీ కొరఢా ఝులిపించేందుకు రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే సర్కిల్- 17లోని ఖైరతాబాద్, సోమాజిగూడ, అమీర్పేట్, సనత్నగర్, సర్కిల్ -18లోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, వెంకటేశ్వరకాలనీ, షేక్పేట్ డివిజన్లలో స్పెషల్ డ్రైవ్లు చేపట్టారు. డీసీలు మోహన్ రెడ్డి, రజనీకాంత్ రెడ్డి, ఏఎంవోహెచ్ భార్గవ్ నారాయణ నేతృత్వంలో అధికారుల బృందం ప్రతి షాపును తనిఖీ చేస్తున్నారు.
ఇప్పటి వరకు 170 మందికి నోటీసులు..
రెండు సర్కిళ్లలో ఇప్పటి వరకు 170 మందికి నోటీసులు జారీ చేయగా, 120 మంది చెల్లించారు. మిగిలిన వారు కూడా నిర్ణీత సమయంలో కట్టకుంటే వారి షాపులు సీజ్ చేస్తామని అధికారులు చెబుతున్నారు. అలాగే ట్రేడ్ లైసెన్సులు లేని వారు వెంటనే మై జీహెచ్ఎంసీ యాప్, ఆన్లైన్, మీ సేవా కేంద్రాల్లో ఆైప్లె చేసుకోవాలని సూచించారు. లేని పక్షంలో కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు.
లైసెన్సు ఫీజును వారం రోజుల్లోపు చెల్లించాలి
ట్రేడ్ లైసెన్సులకు సంబంధించిన ఫీజును వారం రోజుల్లోపు చెల్లించాలి. లేని పక్షంలో ఎలాంటి నోటీసు లేకుండానే వారి షాపులను సీజ్ చేస్తాం. ట్రేడ్ లైసెన్సులు లేకుండా వ్యాపారాలు నిర్వహిస్తే నేరంగా పరిగణిస్తాం. ట్రేడ్ లైసెన్సులు కలిగి ఉన్న ప్రతి వ్యాపారి తన కౌంటర్లో ట్రేడ్ లైసెన్సును డిస్ప్లే చేయాలి.
– డాక్టర్ భార్గవ్ నారాయణ, ఏఎంవోహెచ్ సర్కిల్ 17, 18