సిటీబ్యూరో, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): జేఎన్టీయూ పరిధిలో కొనసాగుతున్న ఇంజినీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ కాలేజీల్లో ఇప్పటి వరకు వేర్వేరు షెడ్యూల్ ప్రకారం తరగతుల నిర్వహణ, సెమిస్టర్ నిర్వహణ, ఫలితాల వెల్లడి జరిగేది. కానీ ఈ విధానాన్ని రద్దు చేస్తూ ఆ స్థానంలో కామన్ సెమిస్టర్ పరీక్షల క్యాలెండర్ (షెడ్యూల్)ను అమలు చేసే ప్రయత్నాలకు శ్రీకారం చుడుతూ జేఎన్టీయూ హైదరాబాద్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఏయే తేదీల్లో సెమిస్టర్ పరీక్షలు నిర్వహించాలి? సెమిస్టర్ పరీక్షలు ఫలితాలు ఎప్పుడు విడుదల చేయాలి? కామన్ పరీక్షల క్యాలెండర్ వల్ల విద్యార్థులకు, కాలేజీ యాజమాన్యాలకు ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి ? వంటి అన్ని విషయాలు కూడా త్వరలో విడుదల చేసే కామన్ పరీక్షల షెడ్యూల్లో పొందుపరుచనున్నారు.
అయితే ఇప్పటికే యూనివర్సిటీ పాలక మండలి సమావేశంలో జేఎన్టీయూ క్యాంపస్ కాలేజీలు, యూనివర్సిటీ కాలేజీలు, అనుబంధ కాలేజీలతో పాటు అటానమస్ కాలేజీలలో యూనివర్సిటీ విడుదల చేసిన రెగ్యులేషన్స్-22 (ఆర్-22)ను తప్పకుండా పాటించే విధంగా నిర్ణయం తీసుకున్నారు. యూనివర్సిటీ విడుదల చేసిన ఆర్-22ను కాలేజీ యాజమాన్యాలు తప్పకుండా అమలు చేయాలి.. అనే నిబంధనను ఉల్లంఘిస్తే.. ఆ ప్రభావం అనుమతులు ఇచ్చే సమయంలో తప్పకుండా పడుతుందని ఆ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ కట్టా నరసింహారెడ్డి హెచ్చరిస్తున్నారు.
ప్లేస్మెంట్కు బెస్ట్ ఛాన్స్..
అన్ని రకాల కాలేజీల్లో ఒకే సమయంలో సెమిస్టర్ పరీక్షలు నిర్వహించడం, ఏక కాలంలో ఫలితాలు విడుదల చేయడం వల్ల విద్యార్థులు తమ భవిష్యత్తును కూడా సకాలంలో నిర్ణయించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత నిర్వహించే జాబ్మేళాలు, క్యాంపస్లో నిర్వహించే ప్లేస్మెంట్ కార్యక్రమాలకు డిగ్రీలు పొందిన యువత సిద్ధంగా ఉంటారన్న అభిప్రాయాలు కూడా ఆ యూనివర్సిటీ అధికారులు వెల్లడించారు.
త్వరలోనే ప్రిన్సిపాళ్లు,యాజమాన్యాలతో ప్రత్యేక సమావేశం..
యూనివర్సిటీ కాలేజీలు, అటానమస్ కాలేజీలతో పాటు అఫిలియేషన్ కాలేజీలలో ఎందుకు కామన్ సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ పాటించాలి ? ఎందుకు అన్ని కాలేజీలు పరీక్షల ఫలితాలు విడుదల చేయాలి ? దాని వల్ల కలిగే ప్రయోజనాల గురించి సమగ్రంగా వివరించడానికి త్వరలోనే అయా కాలేజీల ప్రిన్సిపాళ్లు, యాజమాన్యాలతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ఆ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మంజూర్ హుస్సేన్ తెలిపారు. అందుకోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు.