సిటీబ్యూరో,నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): ఇలాంటి మెసేజ్లతో తస్మాత్ జాగ్రత్త.. “నేను క్రిప్టోలో పెట్టుబడులు పెట్టాను.. నాలుగు రోజుల్లో నాలుగింతల లాభాలొచ్చాయి.. మా స్నేహితుడు కూడా క్రిప్టోలో రూ. 80 వేలు పెట్టుబడి పెట్టాడు.. నాలుగైదు రోజుల్లోనే 10 లక్షలు సంపాదించాడు”.. అంటూ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో సైబర్ నేరగాళ్లు మెసేజ్లు పంపిస్తున్నారు. అంతేకాదు.. కాంటాక్ట్ చేయాలంటూ ఫోన్నంబర్లు, లింక్లు కూడా పంపిస్తున్నారు.. ఇలాంటి మెసేజ్లను నమ్మకండి.. ఒక పథకం ప్రకారం సైబర్ నేరగాళ్లు వలపన్ని ఇలాంటి మెసేజ్లను పంపిస్తున్నారు. అత్యాశకు వెళ్లి నేరగాళ్ల మాటలు నమ్మితే ఖాతాలు ఖాళీ అవుతాయి. డబ్బులు పోతాయి.. అంటూ సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.
సైబర్ నేరగాళ్ల నయా పంథా..
క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టించేందుకు సైబర్నేరగాళ్లు ఇన్స్టాగ్రామ్తో నయా పంథాను ఎంచుకున్నారు. ఇందుకు ఇన్స్టాగ్రామ్ ఐడీలను హ్యాక్ చేస్తున్నారు. ఈ ఐడీలో ఉన్న నంబర్లకు మెసేజ్లు పంపిస్తూ.. నేను క్రిప్టోలో తక్కువ పెట్టుబడితో పెద్ద మొత్తంలో సంపాదించాను.. మీరు కూడా సంపాదించండి.. అంటూ ఫేక్ మేసేజ్లు పంపిస్తూ అమాయకులకు వల వేస్తున్నారు. ఈ మెసేజ్లను గుడ్డిగా నమ్మి చాలా మంది లక్షలు, కోట్లల్లో పెట్టుబడులు పెడుతూ మోసపోతున్నారు.
గతంలో ఫేస్బుక్..
గతంలో ఫేస్బుక్, వాట్సాప్, టెక్స్ మేసేజ్లతో అమాయకులను ఆకర్షించిన సైబర్ నేరగాళ్లు.. నెల రోజులుగా ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రచారం చేస్తూ నయా మోసాలకు పాల్పడుతున్నారని సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులు గుర్తించారు. ఇన్స్టాగ్రామ్ ఐడీలను హ్యాక్ చేయడం ఒక పక్క అయితే.. మరో పక్క కొంతమంది ఇన్స్టాగ్రామ్ ఖాతాదారులను మచ్చిక చేసుకుంటున్నారు. వారికి కమీషన్ ఇస్తూ.. వారి ద్వారా క్రిప్టో కరెన్సీ ఇన్వెస్ట్మెంట్లపై ప్రచారం చేయిస్తున్నారు. ఇలాంటి ప్రలోభాలతో కొందరు ఖాతాదారులు తమ స్నేహితులు, తెలిసిన వారికి మేసేజ్లు పంపిస్తూ క్రిప్టోలో పెట్టుబడి పెడితే మంచి లాభాలు ఉన్నాయంటూ నమ్మిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ సైబర్క్రైమ్ పోలీసు స్టేషన్లో ఇలాంటి మోసానికి సంబంధించి ఒక కేసు నమోదయ్యింది. బాధితుడు వ్యాపారి. తన స్నేహితులతో క్రిప్టోలో పెట్టుబడులు పెట్టించాడు. ఏడుగురు స్నేహితులతో కలిసి రూ.1.2 కోట్లు పెట్టుబడిగా పెట్టారు. అందరూ మోసపోయారు. అయితే, స్నేహితులు మాత్రం.. తాము పెట్టిన పెట్టుబడి వెనక్కి ఇవ్వాలంటూ వ్యాపారిపై ఒత్తిడి తేవడంతో.. తాను కూడా మోసపోయానంటూ అందరు కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేశారు.
కోట్లు కొల్లగొడుతున్నారు..
క్రిప్టో మోసాల వెనుక విదేశీయుల హస్తం ఉంది. ఇటీవల ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కేసుల్లో చైనీయులను హైదరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. చైనా, నైజీరియన్ సైబర్ నేరగాళ్లు క్రిప్టో మోసాల్లో నిందితులుగా ఉన్నారు. మోసాలకు గురవుతున్న వారిలో ఎక్కువ మంది విద్యావేత్తులు, కంప్యూటర్పై అవగాహన ఉన్నవారే ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. సోషల్మీడియా, సెల్ఫోన్ మేసేజ్ల ద్వారా ఆకర్షితులవుతూ, తనకు తెలిసిన వారు భారీగా సంపాదించారనే ప్రకటన చూసి.. అది నిజమని గుడ్డిగా నమ్ముతూ మోసపోతున్నారు.
మోసం ఇలా…!
సైబర్ నేరగాళ్ల మాటలు నమ్మి ఓకే చెప్పేస్తే.. వెంటనే వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్బుక్, టెక్స్ మేసేజ్ ద్వారా ఒక లింక్ను పంపిస్తారు. ఆ లింక్ను క్లిక్ చేయగానే యాప్ డౌన్ లోడ్ అవుతుంది. అందులో పేమెంట్ ఆప్షన్, ప్రొఫైల్ ఫిల్ చేయండంటూ సూచిస్తారు. మొదట కొందరు రూ. 10 వేలు పెట్టుబడి పెడితే.. అందులో నుంచి రూ. 3 వేలు లాభం అంటూ అదే రోజు పంపిస్తారు, మిగతాది పెట్టుబడిగా ఉండాలని సూచిస్తారు. మరుసటి రోజు రూ. 20 వేలు పెట్టుబడి.. రూ.6 వేలు లాభం అంటూ ఇచ్చేస్తారు. ఇలా లక్షల వరకు పెట్టుబడి పెట్టిస్తూ, అంతకు ముందు పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలంటూ పంచుతారు. లక్ష రూపాయల పెట్టుబడి పెడితే.. లాభం రూ. 5 లక్షలు వచ్చిదంటూ సూచిస్తారు. రూ.5 లక్షలకు ముందుగా 30 శాతం డబ్బు చెల్లించి, ఆ తర్వాత మిగితా నగదును డ్రా చేసుకునే వీలు ఉంటుందంటూ నమ్మిస్తుంటారు. ఇలా మాటలతో మాయ చేస్తూ లక్షలు, కోట్లలో పెట్టుబడులు పెట్టిస్తూ మోసాలు చేస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులకు సంబంధించిన మేసేజ్లు, ఫోన్లను గుడ్డిగా నమ్మి మోసపోవద్దని సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు.