హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని ఆర్థిక, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. మెదక్-సిద్దిపేట నేషనల్ హైవే పనులను వెంటనే చేపట్టాలని, అందుకు అవసరమైన భూసేకరణ పనులను పూర్తి చేయాలని ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్లోని ఎంసీఆర్హెచ్చార్డీలో మెదక్-సిద్దిపేట నేషనల్ హైవేకు సంబంధించి రీచ్-1, రీచ్-2 పనులపై మంత్రి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. సిద్దిపేట జిల్లాలోని పోతారెడ్డిపేట నుంచి రంగధామ్పల్లి వంతెన వరకు రీచ్-1, మెదక్ పట్టణం నుంచి నిజాంపేట వరకు రీచ్-2గా పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. 69.97 కిలోమీటర్ల నిడివి ఉండే మెదక్-సిద్దిపేట జాతీయ రహదారిని రూ.882.18 కోట్లతో చేపట్టినట్టు వెల్లడించారు. ఇందులో మెదక్ జిల్లాలో 33.676 కిలోమీటర్లు, సిద్దిపేటలో 36.302 కిలోమీటర్లలో నాలుగు లేన్ల రోడ్డు నిర్మించనున్నట్లు పేర్కొన్నారు.
సిద్దిపేట జిల్లాలో పోతిరెడ్డిపేట, అక్బర్పేట, చిట్టాపూర్, హబ్సీపూర్, ధర్మారం, తిమ్మాపూర్, ఇరోడు, బూరుగుపల్లి గ్రామాలతోపాటు సిద్దిపేట పట్టణ పరిధిలో నాలుగు లేన్ల రోడ్లు వస్తాయని తెలిపారు. మెదక్ జిల్లాలో మెదక్టౌన్, పత్తూరు, అకన్నపేట, రామాయంపేట, కోనాపూర్, నందిగామ, నిజాంపేట గ్రామాల్లో నాలుగు లేన్ల రోడ్లు రావడంతో ఆ ప్రాంత రూపురేఖలు మారిపోతాయని చెప్పారు. నేషనల్ హైవే రోడ్డు పనులు సాగే గ్రామాల వెంట 4 లైన్లరోడ్లు, వీధి దీపాలు, రేలింగ్, సైడ్డ్రైన్లు, ఫుట్పాత్లు నిర్మించాలని అధికారులను ఆదేశించారు. సిద్దిపేట టౌన్లో ఎన్సాన్పల్లి జంక్షన్ నుంచి రంగధామ్పల్లి బ్రిడ్జి వరకు రెండు లేన్ల రోడ్డుతో పాటు ఇరు వైపులా స్థానిక ప్రజల సౌకర్యార్థం సర్వీస్ రోడ్లను నిర్మించాలని అధికారులకు సూచించారు.
ఎన్సాన్పల్లి సరిల్ వద్ద అండర్పాస్..
ఎన్సాన్పల్లి సరిల్ వద్ద వాహనాల కోసం అండర్పాస్ , సిద్దిపేటలో హైదరాబాద్-కరీంనగర్-రామగుండం రోడ్డు వద్ద ఓవర్పాస్ నిర్మించనున్నట్లు ఆర్అండ్బీ అధికారులు మంత్రికి వివరించారు. జాతీయ రహదారిని క్రాస్ చేసేందుకు మెదక్, రామాయంపేట సమీపంలో ఒక్కొక్క అండర్పాస్, మెదక్ జిల్లా అకన్నపేట వద్ద ఓవర్పాస్ నిర్మాణం , అకన్నపేట రైల్వేట్రాక్ వద్ద రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. ఈ రోడ్డు నిర్మాణంతో సిద్దిపేటలో 4 మేజర్ జంక్షన్లు, 19 మైనర్ జంక్షన్లు, మెదక్ జిల్లాలో 4 మేజర్, 15 మైనర్ జంక్షన్లు అభివృద్ధి చెందుతాయని చెప్పారు. రామాయంపేటలో 2.65 కిలోమీటర్ల బైపాస్రోడ్డును నిర్మించనున్నట్లు తెలిపారు.
భూసేకరణ వేగవంతం చేయాలి
మెదక్ జిల్లాలో 26.82 హెక్టార్లు, సిద్దిపేటలో 18.25 హెక్టార్ల భూసేకరణ చేపట్టాలని, మెదక్ జిల్లాలో 9.35 హెక్టార్ల అటవీ భూమి సేకరించాల్సి ఉన్నదని అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీంతో వెంటనే హరీశ్రావు మెదక్, సిద్దిపేట కలెక్టర్లకు ఫోన్ చేసి, భూసేకరణను వేగంగా చేపట్టాలని ఆదేశించారు. అటవీశాఖ అధికారులతోనూ మాట్లాడారు. అటవీ భూముల సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. సమీక్షలో ఎమ్మెల్యే క్రాంతికిరణ్, ఆర్అండ్బీ జాతీయ రహదారుల విభాగం ఈఈ ధర్మారెడ్డి, ఎస్ఈ శ్రీనివాస్రెడ్డితోపాటు ఆర్అడ్బీ అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.