మేడ్చల్, అక్టోబర్ 29(నమస్తే తెలంగాణ)/ మేడ్చల్ : కలిసికట్టుగా కదులుదాం..క్యాన్సర్ను జయిద్దామని సినీహీరో మెగాస్టార్ చిరంజీవి అన్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మగూడలోని మల్లారెడ్డి విశ్వవిద్యాలయంలో విశ్వవిద్యాలయం, ఇస్కాన్ ఆధ్వర్యంలో ‘కిల్ క్యాన్సర్’ పేరుతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి మాట్లాడుతూ.. అవగాహన లేని కారణంగా ఇటీవలి కాలంలో చాలా మంది క్యాన్సర్ బారిన పడుతున్నారని తెలిపారు. వ్యాధిని ప్రాథమిక దశలో గుర్తిస్తే 70 శాతం వరకు నయం చేయవచ్చని పేర్కొన్నారు. ఈ సంస్థ తలపెట్టిన క్యాన్సర్ నిర్మూలన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఆరోగ్యమే మహాభాగ్యం : మంత్రి మల్లారెడ్డి
ఆరోగ్యమే మహాభాగ్యమని, యువత చెడు వ్యసనాలకు బానిసలు కావొద్దని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. క్యాన్సర్ లాంటి రుగ్మతల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇస్కాన్ ప్రతినిధులు మహాశ్రీంగ్ దాస, శ్రీవత్స గురుస్వామి, సుబ్రహ్మణ్య గురుస్వామి, మల్లారెడ్డి విశ్వ విద్యాలయం డైరెక్టర్లు డాక్టర్ భద్రారెడ్డి, మహేందర్ రెడ్డి, డాక్టర్ ప్రీతిరెడ్డి పాల్గొన్నారు.