ఘట్కేసర్,అక్టోబర్28: ప్రజలకు ప్రతి రోజూ స్వచ్ఛమైన తాగునీటిని అందించాలన్న సీఎం కేసీఆర్ లక్ష్యం పోచారం మున్సిపాలిటీలో త్వరలో సాకారం కానుంది. ఇందుకోసం భారీ నీటి ట్యాంక్లను నిర్మించి ఇక్కడి ప్రజలకు ప్రతిరోజూ స్వచ్ఛమైన తాగునీటిని నీటి సరఫరా చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.అవుటర్ రింగ్ రోడ్డు లోపల కొత్తగా ఏర్పాటు చేసిన మున్సిపాలిటీ ప్రజలకు ప్రతిరోజూ( హైదరాబాద్ మెట్రో పాలిటెన్ వాటర్ సైప్లె సీవరేజీ బోర్డు)ద్వారా నీటిని అందించాలన్న లక్ష్యంతో పోచారం మున్సిపాలిటీలో మూడు చోట్ల మూడు ట్యాంక్లను నిర్మిస్తున్నారు. ఒక్కో ట్యాంక్ 36 మీటర్ల స్థల విస్తీర్ణంలో 20లక్షల లీటర్ల నీటి నిలువ సామర్థ్యంతో వీటిని నిర్మిస్తున్నారు. ఒక్కో ట్యంక్ నిర్మాణానికి రూ.2.83 కోట్లతో మొత్తం మూడు ట్యాంక్లకు రూ.8.49 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. పోచారం మున్సిపాలిటీ పరిధిలోని 1వవార్డు శ్రీనివాస నగర్లో, 3వ వార్డు గాంధీనగర్లో18వవార్డు పోచారంలో ఈ ట్యాంక్లను నిర్మిస్తున్నారు. 2022 ఏప్రిల్లో ప్రారంభమైన ఈ ట్యాంక్ల నిర్మాణ పనులు, డిసెంబర్ వరకు పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ట్యాంక్ల నిర్మాణ పనులను ఎన్సీసీ నిర్మాణ సంస్థకు అప్పగించారు. పనులు ప్రస్తుతం 70 శాతం పూర్తయ్యాయి.
ఇక్కడి ప్రజల దాహం తీరనున్నది
పోచారం మున్సిపాలిటీ ప్రజలకు త్వరలో ఇంటింటికీ ప్రతి రోజూ స్వచ్ఛమైన తాగునీటి సరఫరా అందించబోతున్నాం. హైదరాబాద్ మెట్రో పాలిటన్ వాటర్ సైప్లె సీవరేజీ బోర్డు ఆధ్వర్యంలో ప్రస్తుతం నగర వాసులకు అందించే నీటిని,ఇక్కడ ట్యాంక్ల నిర్మాణం పూర్తి కావడంతో మున్సిపాలిటీ ప్రజలకు అందుతుంది.రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఇక్కడి ప్రజల దాహం తీరనున్నది.
-పి.శ్రీనివాస్ రెడ్డి, జనరల్ మేనేజర్,హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ
శుభ పరిణామం
పోచారం మున్సిపాలిటీలో జరుగతున్న అభివృద్ధిలో భాగంగా, మూడు భారీ నీటి ట్యాంక్ల నిర్మాణం ప్రభుత్వం చేపట్టింది. మంత్రి మల్లారెడ్డి కృషి, రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో ఇక్కడి ప్రజలకు త్వరలో స్వచ్ఛమైన తాగునీటిని ఇంటింటికీ సరఫరా చేయబోతున్నాం.పోచారం మున్సిపాలిటీకి ఇది శుభ పరిణామం.
-బి.కొండల్రెడ్డి, పోచారం మున్సిపాలిటీ చైర్మన్.