“ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడే వారి ఫొటోలు దూరం నుంచి తీయడం కాదు.. చౌరస్తాలో వాహనదారుడికి అగుపించేలా నిలబడాలి. అయినప్పటికీ ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడితే వెంటనే సదరు వాహనదారుడికి జరిమానా విధించాలి.” అని ట్రాఫిక్ పోలీసులకు ఉన్నతాధికారులు ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అన్ని సమయాలలో ట్రాఫిక్ కూడళ్ల వద్ద ట్రాఫిక్ సిబ్బంది కన్పిస్తున్నారు.
సిటీబ్యూరో, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ): గీత దాటితే.. ఫైన్ పడుతుంది.. ఇన్నాళ్లు స్టాప్లైన్ దాటొద్దు.. జీబ్రాలైన్పైకి రావద్దు.. ఫ్రీ లెఫ్ట్ బ్లాక్ చేయొద్దంటూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన ట్రాఫిక్ పోలీసులు.. ఎన్ఫోర్స్మెంట్పై దృష్టి పెట్టారు. స్టాప్లైన్ దాటితే వెంటనే కెమెరాతో క్లిక్ మని చలాన్ విధిస్తున్నారు. ప్రతి కూడలిలో ట్రాఫిక్ కానిస్టేబుల్ పక్కాగా ఉంటున్నాడు. గతంలో ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేస్తున్నాయి.. మనం ఉండాల్సిన అవసరముందా అని కొందరు కానిస్టేబుళ్లు రద్దీ వేళలు పూర్తికాగానే సాధారణ సమయాలలో ఆ కూడలిలో నుంచి పక్కకు తప్పుకునే వారు. దూరం నుంచే కెమెరాతో ఫొటోలు కొడుతూ రోజు వారి విధులు ముగ్గించుకునే వారు. హైదరాబాద్లో అపరేషన్ ‘రోప్’తో కానిస్టేబుల్స్ పక్కాగా ఆయా కూడళ్లలో ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
సాఫీ ట్రాఫిక్కు నిరంతర ప్రయత్నాలు
హైదరాబాద్, సైబారాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ఆపరేషన్ రోప్ కొనసాగుతున్నది. ప్రధానంగా రోడ్లపై అడ్డదిడ్డంగా పార్కు చేసే వాహనాలు, క్యారేజ్ వేలను బ్లాక్ చేసే వ్యాపార సముదాయాలు, ఫుట్పాత్లను ఆక్రమించి వ్యాపారాలు చేసే వారిపై పోలీసులు దృష్టి పెట్టారు. స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తూ ట్రాఫిక్కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా క్రమబద్దీకరణ చర్యలు తీసుకుంటున్నారు. మాట వినని వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనల కింద కేసులు నమోదు చేస్తున్నారు. పార్కింగ్ లేని వ్యాపార భవన సముదాయాలు పార్కింగ్ ఏర్పాటు చేసుకోవాలని ఇప్పటికే పలువురికి నోటీసులు జారీ చేశారు. ట్రాఫిక్ పోలీసులు చేస్తున్న ప్రయత్నానికి ఇతర విభాగాలు కూడా తమ వంతు సహకారాన్ని అందిస్తున్నాయి. ఈ విధానంతో త్వరలోనే అన్ని రూట్లలో సాఫీగా ట్రాఫిక్ సాగేందుకు చక్కటి మార్గాలు ఏర్పడుతాయని అధికారులు భావిస్తున్నారు.