మన ఊరు – మన బడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ వచ్చింది. సర్కారు పాఠశాలలో మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా చేపట్టిన అభివృద్ధి పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో మొదటి దశలో 176 ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేశారు. వీటిలో పనులు పూర్తయిన 30 ప్రభుత్వ పాఠశాలలను ఈ నెల చివరి వారంలో ప్రారంభించనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు కసరత్తులు చేస్తున్నారు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు 515 ఉండగా, ఇందులో ప్రాథమిక పాఠశాలలు 375, ప్రాథమికోన్నత పాఠశాలలు 22, ఉన్నత పాఠశాలలు 108, ఎయిడెడ్ పాఠశాలలు 10 ఉన్నాయి. మన ఊరు-మనబడిలో భాగంగా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో 12 అంశాల అభివృద్ధికి ప్రభుత్వం రూ. 70 కోట్లను మంజూరు చేసింది. ఇందులో మండలానికి రెండు చొప్పున 30 ప్రాథమిక పాఠశాలలను సిద్ధం చేశారు. వీటికి ప్రతి పాఠశాలకు రూ. 30 లక్షల చొప్పున రూ. 9 కోట్ల నిధులను వెచ్చించారు. మిగతా పాఠశాలలలో అభివృద్ధి పనులను శరవేగంగా కొనసాగిస్తున్నారు. ఈ ఏడాది నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లబోధన అమలుతో విద్యార్థులు అధిక సంఖ్యలో అడ్మిషన్లు పొందారు. జిల్లాలో 92,103 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నారు. ఉచిత పుస్తకాలు, మధ్యాహ్న భోజన సౌకర్యాలతో పాటు మెరుగైన బోధన ఉండడంతో ప్రభుత్వ పాఠశాలల వైపు పిల్లల తల్లిదండ్రులు దృష్టి సారించారు.
5వేల మందికి విదేశీ విద్యానిధి
ప్రతిభ ఉండి ఆర్థిక స్తోమతలేని 5వేల మంది నిరుపేద విద్యార్థులకు ప్రభుత్వం రూ.20లక్షల చొప్పున ఆర్థికసాయం చేసి విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు అండగా నిలిచిందని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. పాఠశాల అభివృద్ధి ప్రభుత్వం రూ. 50 లక్షలు మంజూరు చేసినట్లు చెప్పారు. బోడుప్పల్ ప్రభుత్వ పాఠశాలలో అదనపు గదుల నిర్మాణానికి సహకారం అందించిన టెక్నిప్ ఎఫ్ఎంసీ సంస్థ యాజమాన్యాన్ని మంత్రి అభినందించారు.
అదేవిధంగా చెంగిచర్లలో ప్రభుత్వ పాఠశాల భవన నిర్మాణానికి 2 ఎకరాల స్థలం కేటాయించినట్లు చెప్పారు. చెంగిచెర్ల పాఠశాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేయాల్సిందింగా టెక్నిప్ ఎఫ్ఎంసీ సంస్థ యాజమాన్యాన్ని కోరారు. ఈ మేరకు వారు సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో మేయర్ బుచ్చిరెడ్డి, ఎమ్మెల్సీ కాటపల్లి జనార్దన్రెడ్డి, టెక్నిప్ ఎఫ్ఎంసీ సంస్థ ప్రతినిధులు తివారి, హౌజులా తివారి, జానీ, సందీప్ ముఖర్జీ, డీఈవో విజయకుమారి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీరవిగౌడ్, బీఆర్ఎస్(టీఆర్ఎస్) బోడుప్పల్ అధ్యక్షుడు మంద సం జీవరెడ్డి, పాఠశాల ప్ర ధానోపాధ్యాయులు శ్రీనివాస్రెడ్డి, స్థానిక కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.
ఈ నెల చివరి వారంలో ప్రారంభమయ్యే 30 ప్రాథమిక పాఠశాలలు
మండలం : ప్రారంభం అయ్యే పాఠశాలలు
అల్వాల్ : కౌకుర్(ఎంపీపీఎస్), మచ్చబొల్లారం(ఎంపీపీఎస్)
బాచ్పల్లి : నిజాంపేట్(ఎంపీపీఎస్), ప్రగతినగర్(ఎంపీపీఎస్)
బాల్నగర్ : బబ్బుగూడ(ఎంపీపీఎస్), హస్మత్పేట్(యూఎం)
దుండిగల్ : బహుదూర్పల్లి(ఎంపీపీఎస్), దూలపల్లి(ఎంపీపీఎస్)
ఘట్కేసర్ : పోచారం(ఎంపీపీఎస్), మహేశ్వరినగర్(ఎంపీపీఎస్)
కాప్రా : కాప్రా(ఎంపీయూపీఎస్), చిన్న చర్లపల్లి(ఎంపీపీఎస్)
కీసర : చిర్యాల్(ఎంపీపీఎస్), తిమ్మాయిపల్లి(ఎంపీపీఎస్)
కూకట్పల్లి : ఆర్పీ కాలనీ(ఎంపీపీఎస్), హెచ్ఎంటీ వీకర్ సెక్షన్కాలనీ(ఎంపీపీఎస్)
మల్కాజిగిరి : మల్కాజిగిరి( ఎంపీపీఎస్. బీ), మౌలాలి(రైల్వేకాలనీ) (ఎంపీపీఎస్)
మేడ్చల్ : అత్వెల్లి(ఎంపీపీఎస్), లక్ష్మీనగర్(ఎంపీపీఎస్)
మేడిపల్లి : పీర్జాదిగూడ(ఎంపీపీఎస్), కమలానగర్(ఎంపీపీఎస్)
మూడుచింతలపల్లి: కొల్తూర్(ఎంపీపీఎస్), లక్ష్మాపూర్(జడ్పీహెచ్ఎస్)
కుత్బుల్లాపూర్: భగత్సింగ్నగర్(ఎంపీపీఎస్), సురారం(ఎంపీపీఎస్)
శామీర్పేట్ : శామీర్పేట్(ఎంపీపీఎస్), ఉప్పర్పల్లి(ఎంపీయూపీఎస్)
ఉప్పల్ : లక్ష్మీనగర్(ఎంపీపీఎస్), కొత్తపేట్(ఎంపీపీఎస్)