ఖైరతాబాద్, అక్టోబర్ 15 : కోమటిరెడ్డి రాజ్గోపాల్ రెడ్డి ధనదాహంతోనే మునుగోడు ఉప ఎన్నిక వచ్చిందని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, తెలంగాణ బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ ఓరుగంటి వెంకటేశం గౌడ్ ఆరోపించారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంట్రాక్టుల కోసమే రాజగోపాల్రెడ్డి కాంగ్రెస్కు ద్రోహం చేసి బీజేపీలో చేరారని దుయ్యబట్టారు. కాంగ్రెస్లో అనేక పదవులు పొంది.. ఇప్పుడు బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారని విమర్శించారు. అభివృద్ధి అంటూ నియోజకవర్గ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని.. మునుగోడు ప్రజలు తప్పక కర్రుకాల్చి వాత పెట్టడం ఖాయమన్నారు.
రాజకీయ భిక్ష పెట్టిన పార్టీకే నర్సయ్య ద్రోహం..
రాజకీయ భిక్ష పెట్టిన పార్టీకి ద్రోహం చేసిన మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్కు తగిన బుద్ధి చెప్పడం ఖాయమని వెంకటేశం గౌడ్ అన్నారు. ఒక డాక్టర్ను ఎంపీ చేస్తే టీఆర్ఎస్కు తీరని అన్యాయం చేశారని విమర్శించారు. తెలంగాణ ప్రజల ఆత్మాభిమానం, ఆకాంక్షను దేశ ద్రోహుల పాదాల పెట్టడం అన్యాయమన్నారు. తన సామాజిక వర్గానికి బూర చేసిందేమీ లేదన్నారు. రాజకీయ జన్మనిచ్చిన టీఆర్ఎస్ను వదిలి బీజేపీలో చేరాల్సిన అవసరం ఎందో చెప్పాలని డిమాండ్ చేశారు. మతతత్వం, కులపిచ్చి ఉన్న పార్టీకి మద్దతు తెలపడం ఎంత వరకు న్యాయమన్నారు. దేశ గతిని మార్చాలని బీఆర్ఎస్ను స్థాపించిన సీఎం కేసీఆర్కు ప్రతిఒక్కరూ మద్దతు ఇవ్వాలన్నారు.
రేవంత్కు ఓటు అడిగే హక్కులేదు..
తన సామాజిక వర్గం గురించే ఎప్పుడూ ఆలోచించే రేవంత్రెడ్డికి బడుగు, బలహీన వర్గాల ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. రేవంత్రెడ్డి వైఖరి నచ్చకనే ఆ పార్టీ నుంచి తాను బయటికి వచ్చాననన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్కు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు.
బీజేపీని తరిమికొట్టాలి..
పొరపాటున తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే జరిగే నష్టం అపారమన్నారు. బడుగు, బలహీన వర్గాలకు వ్యతిరేకంగా పని చేయడమే బీజేపీ లక్ష్య మన్నారు. చట్టసభల్లో రిజర్వేషన్లు పెంచాల్సి వస్తుందనే బీసీ జనగణన చేయడం లేదని విమర్శించారు. వ్యాపార దృక్పథంతో ఆలోచించే ఆ పార్టీని తెలంగాణ నుంచి తరిమి కొట్టాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. మునుగోడులోని గౌడ్లు, బీసీలు కచ్చితంగా తెలంగాణ వాదాన్ని గెలిపిస్తారన్న ఆశాభావం వ్యక్తం చేశారు. బీసీలు డబ్బులకు అమ్ముడుపోరని, రాజ్గోపాల్ రెడ్డి, రేవంత్ రెడ్డి ప్రలోభాలకు లొంగరన్నారు.