జూబ్లీహిల్స్, అక్టోబర్ 15: క్షయ రహిత సమాజమే లక్ష్యంగా ప్రభుత్వం నడుం బిగించింది. ఇందులో భాగంగా ‘ఇగ్రా.. టీబీఐ’ పైలట్ ప్రాజెక్టును హైదరాబాద్లో అమలు చేయనున్నది. జిల్లాలోని 19 టీబీ సెంటర్ల పరిధిలోని డయాగ్నోస్టిక్ కేంద్రాల్లో రేపటి నుంచి నిర్దారణ పరీక్షలు చేయనున్నది. అయితే గతానికి భిన్నంగా ఈ సారి అధికారులు తెమడతో కాకుండా రక్త పరీక్షలు చేయనున్నారు. టీబీ వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో తెలంగాణలోని మూడు జిల్లాల్లో వ్యాధిగ్రస్తులను నిర్దారించేందుకు ఇటీవలే పైలెట్ ప్రాజెక్టు చేపట్టారు. హైదరాబాద్లో ఈ ప్రాజెక్టును ఈ నెల 17 నుంచి ప్రారంభించనున్నారు. టీబీతో బాధపడుతూ చికిత్స పొందుతున్న వారు జిల్లాలో 9 వేల మంది ఉండగా.. వీరి కుటుంబ సభ్యులకు రేపటి నుంచి సమీప కేంద్రాల్లో రక్త పరీక్షలు చేయనున్నారు.
ఆరేండ్లు నిండితే పరీక్షలే..
‘ఇగ్రా’ (ఇంటర్ ఫెరాన్ గామ రిలీజ్ ఎస్ఏ) ప్రాజెక్ట్లో భాగంగా టీబీతో బాధపడుతున్న రోగుల కుటుంబ సభ్యులకు పరీక్షలు చేయనున్నారు. కుటుంబ సభ్యుల్లో ఆరేండ్ల పైబడిన వారందరికీ (టీబీ ఇన్ఫెక్షన్) పరీక్షలు నిర్వహించనున్నారు. ఇప్పటికే ఆరేండ్ల లోపు పిల్లలకు ఐఎన్హెచ్ మందులు అందిస్తుండగా తాజాగా కుటుంబంలో ఆరేండ్ల పైబడిన వారికి పరీక్షలు నిర్వహించి పాజిటీవ్ వస్తే టీపీబీ (ట్యూబర్క్లోసిస్ ప్రివెన్షన్ థెరపీ) చికిత్స అందించనున్నారు. బరువు ప్రకారం నాణ్యమైన మందులు ఇవ్వనున్నారు. ఎప్పటిలా ప్రభుత్వం ఇచ్చే రూ.500 ఆర్థిక సాయంతో పాటు బాధితులకు దాతల సహకారంతో పప్పులు, నూనె, బెల్లం లాంటి పోషక పదార్థాలు అందించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు సోమవారం నుంచి అన్ని టీబీ సెంటర్లలో అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నారు.
దాతలు ముందుకు రావాలి..
టీబీ రహిత దేశంగా మార్చేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలి. కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా టీబీ లక్షణాలు ఉంటే మిగితా వారంతా నిర్దారిత పరీక్షలు చేయించుకోవాలి. గతానికి భిన్నంగా ఈ సారి రక్త నమూనాలు సేకరించి టీబీని నిర్దారించనున్నాం. ప్రస్తుతం జిల్లాలో ఆరు వేల మందికి చికిత్సలు అందుతాయి.
– డాక్టర్ కల్పన కంటే, జిల్లా టీబీ కంట్రోల్ ఆఫీసర్