సిటీబ్యూరో, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ), /కవాడిగూడ: టీటీడీ ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాలు నేత్ర పర్వంగా సాగుతున్నాయి. విద్యుత్ కాంతుల తళుకులతో స్టేడియం సరికొత్త శోభను సంతరించుకోగా..భక్తుల గోవింద నామస్మరణతో ఆ ప్రాంతం ఆధ్యాత్మిక పరిమళాలతో విరాజిల్లింది.
నేత్రపర్వంగా తిరుప్పాడ సేవ ..
తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామికి ప్రతి గురువారం అర్చన నిర్వహిస్తారు. అనంతరం శ్రీ స్వామివారికి ఎదురుగా పెద్ద పీఠంపై పులిహోర రాశితోపాటు టెంకాయ, ఇతర పూజాసామగ్రిని ఉంచుతారు. వీటిని గర్భాలయంలోని స్వామివారికి నివేదిస్తారు. తిరుమలలో చేపట్టే ఈ ఘట్టాన్ని గురువారం ఎన్టీఆర్ స్టేడియంలోని నమూనా ఆలయంలో అర్చకులు ఆవిష్కరించారు. భక్తుల చేత సంకల్పం చెప్పించాక వేద పారాయణంతోపాటు శ్రీనివాస గద్యాన్ని వేదపండితులు పఠించారు.
సర్వ సౌభాగ్యాలు కలగాలని..
సర్వ సౌభాగ్యాలు కలగాలని, దేశ ప్రజలంతా పాడిపంటలతో సుఖంగా ఉండాలని సంకల్పాన్ని చెప్పి తిరుప్పావడ సేవను ఆచరిస్తారు. అంతకుముందు నేత్ర దర్శనం నిర్వహించారు. స్వామివారి తీక్షణమైన చూపులు పులిహోర రాశిపై పడేలా చేయడం వల్ల ఆ ఆహారపదార్థాలు పవిత్రత పొందుతాయని అర్చకులు తెలిపారు. టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సరస్వతీ ప్రసాద్ ఆలపించిన అన్నమయ్య సంకీర్తనలు భక్త జనులను అలరించాయి. కాగా, గోవా గవర్నర్ పీఎస్ శ్రీధరన్ పిైళ్లె శ్రీనివాసుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కార్యక్రమంలో తిరుమల శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు, ఆగమ సలహాదారు మోహనరంగాచార్యులు, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, న్యూఢిల్లీ స్థానిక సలహా మండలి అధ్యక్షురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, దాతలు హర్షవర్ధన్, ఎస్ఎస్ రెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, సుబ్బారెడ్డి, ధార్మిక కార్యక్రమాల అధికారి విజయలక్ష్మి, అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు డాక్టర్ ఆకెళ్ల విభీషణశర్మ, ఏఈవోలు జగన్మోహనాచార్యులు, పార్ధసారథి, శ్రీరాములు, ఇతర అధికారులు పాల్గొన్నారు.