పెరుగుతున్న ఇంధన ధరలతో సిటీలో ఎలక్ట్రిక్ వాహనాలు, ఈ చార్జింగ్ వినియోగం పెరుగుతోంది. ప్రజల అవసరాలకు అనుగుణంగా ఆఫీసులు, ప్రభుత్వ కార్యాలయాలు, పెట్రోల్ బంకులతోపాటు హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ కార్యాలయాల్లోనూ ఎలక్ట్రానిక్ చార్జింగ్ స్టేషన్లు వస్తున్నాయి. అయితే మెరుగుపడుతున్న ఎలక్ట్రానిక్ మౌలిక వసతులతో నాణ్యతా ప్రమాణాలు కీలకంగా మారాయి. ముఖ్యంగా హైదరాబాద్లాంటి మెట్రో నగరాల్లో క్వాలిటీ, మౌలిక వసతులతోనే వాడకం పెరిగే అవకాశం ఉంటుంది.
– సిటీ బ్యూరో, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ)
ఒకప్పుడు 250 కూడా లేని ఈ-వెహికిల్స్ 2020నాటికి 4800 పైగా విక్రయించారు. ప్రస్తుతం ఒక్క సిటీలోనే దాదాపు 10వేలకు పైగా ఎలక్ట్రిక్ వాహనాలు రోడ్డెక్కుతున్నాయి. ఈ క్రమంలో చార్జింగ్ స్టేషన్లు, చార్జింగ్ స్టేషన్ల తయారీ, వాహన తయారీ, బ్యాటరీల క్వాలిటీ వంటి అంశాల నాణ్యత ప్రమాణాలను పర్యవేక్షించాల్సిన అవసరం ఏర్పడింది. ఎలక్ట్రిక్ వాహనాలు, ఎనర్జీ స్టోరేజీ వ్యవస్థలను ప్రోత్సాహించడమే లక్ష్యంగా 2019లో ఈ వెహికిల్స్ పాలసీని తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చింది. దీనికి తగినట్లుగా ఎలక్ట్రిక్ చార్జింగ్ పాయింట్ల నిర్మాణ సంస్థలకు ప్రోత్సాహాకాలు ప్రభుత్వం ఇవ్వనుండగా, నిర్వహణను టీఎస్ రెడ్కో ఆధ్వర్యంలో పర్యవేక్షించనుంది. ప్రస్తుతం టీఎస్ రెడ్కో ఆధ్వర్యంలో ఇప్పటివరకు 138 ఎలక్ట్రిక్ వాహన చార్జింగ్ కేంద్రాలు రానున్నాయి. దాదాపు 979 ప్రాంతాల్లో వివిధ శాఖలు చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు రెడ్కోను ఆశ్రయించాయి.
ఇదిలా ఉంటే, ఇటీవల సికింద్రాబాద్లోని ఓ ఈవీ షోరూంలో జరిగిన ప్రమాదం జరిగిన నేపథ్యంలో ఈవీల నాణ్యతను మరింతగా పెంచేందుకు నిపుణులు కసరత్తు ప్రారంభించారు. నాణ్యత ప్రమాణాలతోనే ఈ రంగంలో సుస్థిర వృద్ధిని సాధించగలుగుతామని, ఈ మేరకు క్వాలిటీ ఇంజన్లు, చార్జింగ్ స్టేషన్ల తయారీని పర్యవేక్షించాలని ఈఎస్సీఐ క్వాలిటీ మానిటరింగ్ నిపుణులు ప్రొ. డా.కృష్ణప్రసాద్రావు స్పష్టం చేశారు.