డైరెక్టర్ బీఎస్ మూర్తి సంగారెడ్డి, అక్టోబర్ 6(నమస్తే తెలంగాణ) : కమ్యూనికేషన్ రంగంలో ఐఐటీ హైదరాబాద్ జరుపుతున్న పరిశోధనలు మంచి ఫలితాలు ఇస్తున్నట్లు ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బీఎస్ మూర్తి తెలిపారు. ముఖ్యంగా 5జీకి సంబంధించి ఐఐటీ హైదరాబాద్ ఇటీవల అభివృద్ధి చేసిన టెక్నాలజీని దేశీయ టెలీకమ్యూనికేషన్ కంపెనీలు వాడుకునేందుకు ముందుకు వస్తున్నట్లు చెప్పారు. ఇదే సమయంలో 6జీకి సంబంధించిన పరిశోధనలు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. గురువారం సంగారెడ్డి మండలం కందిలోని ఐఐటీ హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ దేశంలోని ఐఐటీలు ప్రభుత్వరంగ సంస్థలు, పరిశ్రమల సహకారంతో పరిశోధనలు చేపట్టి, నూతన ఆవిష్కరణలను ఉత్పత్తులుగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఇందులో భాగంగా ఐఐటీ హైదరాబాద్ నుంచి 100 స్టార్టప్ కంపెనీలు ఆవిర్భవించినట్లు తెలిపారు. పరిశోధనలను ప్రోత్సహించేందుకు దేశంలోని 23 ఐఐటీలు ఈనెల 14, 15 తేదీల్లో ఢిల్లీ ఐఐటీలో ‘ఇన్వెంటివ్ టెక్నాలజీస్’ పేరుతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ ఎగ్జిబిషన్లో ఐఐటీల్లోని 75 నూతన ఆవిష్కరణలను ప్రదర్శిస్తామని తెలిపారు. ఢిల్లీలో జరిగే ఇన్వెంటివ్ ఎగ్జిబిషన్కు ఐఐటీ హైదరాబాద్ నుంచి ఆరు నూతన ఆవిష్కరణలు ఎంపికైనట్లు తెలిపారు. విద్యార్థులు నూతన ఆవిష్కరణలు చేపట్టేలా ప్రోత్సహించేలా ఐఐటీ హైదరాబాద్లో కొత్త కోర్సులు ప్రవేశపెడుతున్నట్లు వివరించారు. కొత్తగా ఐసీ డిజైన్ ఆండ్ మాన్యుఫాక్చర్ బీటెక్ కోర్సును ప్రారంభించనున్నట్లు చెప్పారు.
అలాగే సెమీ కండక్టర్స్ డివైస్ అండ్ మెటీరియల్ ఎంటెక్ కోర్సు ప్రారంభించనున్నట్లు చెప్పారు. దేశంలో మొట్టమొదటి సారిగా ఐఐటీ హైదరాబాద్ సిస్టమ్ ప్యాకేజింగ్ ఎంటెక్ కోర్సును ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఐఐటీ హైదరాబాద్లో ప్రవేశపెట్టిన నూతన యూజీ, పీజీ కోర్సుల వివరాలను ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్(ఏఐసీటీఈ)కి అందజేసినట్లు తెలిపారు. ఐఐటీ హైదరాబాద్లో బోధన పద్ధ్దతులను దేశంలోని ఇతర ఇంజినీరింగ్ కళాశాల్లో ప్రవేశపెట్టేందుకు ఏఐసీటీఈ చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఐఐటీ హైదరాబాద్ చేపట్టిన నూతన ఆవిష్కరణల గురించి ఐఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్లు నిశాంత్, దేబరాజ్ భట్టాచార్య, జోత్సేనేందు గిరి, అనిల్, ప్రసాద్ వివరించారు. విలేకరుల సమావేశంలో ప్రొఫెసర్ కృష్ణమోహన్, ఐఐటీ పీహెచ్డీ విద్యార్థులు పాల్గొన్నారు.